Governor Tamilisai : ఓ మహిళ కుటుంబంలో ఆనందం నింపిన గవర్నర్ ట్వీట్

Woman

Woman

Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేసిన ట్వీట్ ఓ మహిళ కుటుంబంలో ఆనందం నింపింది. మల్లిగారి సంధ్యారాణి అనే మహిళ.. తన కుటుంబ దుస్థితిని వివరిస్తూ గురువారం గవర్నర్ తమిళిసై కు ట్వీట్ చేశారు. గురువారం భైరాన్‌పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా సిద్దిపేటలోని చేర్యాల వద్ద ఆమె గవర్నర్ కాన్వాయ్‌ను ఆపి నిరసన చేపట్టారు. సంధ్య కాన్వాయ్‌ను ఆపడంతో, గవర్నర్, భద్రతా సిబ్బంది భద్రతా కారణాల దృష్ట్యా ఆందోళన తెలిపినా పట్టించుకోకుండా, కారు దిగి ఆమె ఇంటిని సందర్శించారు. తన ముగ్గురు కూతుళ్లతో కలిసి శిథిలమైన ఇంట్లో ఉన్న సంధ్య దీనస్థితిని చూసి గవర్నర్ చలించిపోయారు. తనకు ఇల్లు మంజూరు కాలేదని, శిథిలావస్థలో ఉన్న ఇంటిలో కుటుంబంతో కలిసి ఉండడం ఇబ్బందిగా ఉందని సంధ్య గవర్నర్‌ను అభ్యర్థించింది. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన గవర్నర్, రాజ్ భవన్ నుంచి ఆమెకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Read Also: CM KCR : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిని క‌లిసిన సీఎం కేసీఆర్

సంధ్య కుటుంబం దుస్థితి గురించి గవర్నర్ ట్వీట్ చేయడంతో భారత్ బయోటెక్‌కు చెందిన సుచిత్రా ఎల్లా స్పందించారు. సంధ్య పిల్లల చదువుకు మద్దతు ఇవ్వడానికి సుచిత్రా ఎల్లా సుముఖత వ్యక్తం చేశారు. జీనోమ్ వ్యాలీ క్యాంపస్‌లో సంధ్యకు తగిన ఉద్యోగం ఇస్తానని తెలిపారు. ఆమె కుటుంబానికి సహాయం చేయటానికి ముందుకు వచ్చిన సుచిత్రా ఎల్లా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తు, గవర్నర్ సుచిత్రా ఎల్లా మానవతా దృక్పథాన్ని, మంచి మనస్సును, పరోపకార గుణాన్ని మెచ్చుకున్నారు. సంధ్య, ఆమె కుటుంబానికి సహాయం అందించటంలో రాజ్ భవన్ అధికారులు భారత్ బయోటెక్‌తో సమన్వయం చేసుకుంటారు.