NTV Telugu Site icon

Vignan’s University: వేడుకగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవం.. ప్రముఖులకు డాక్టరేట్లు

Vignam

Vignam

ప్రపంచం విభిన్న నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కోసం ఎదురుచూస్తోందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవాన్ని శనివారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ల విజయాన్ని జరుపుకోవడానికి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు రావడం చాలా గర్వంగా, ఆనందంగా ఉందన్నారు. మీరు డిగ్రీ పట్టాలతో అకాడెమియా సరిహద్దులను దాటి అడుగు పెట్టినప్పుడు.. వాస్తవ ప్రపంచం కొత్త సవాళ్లను అందిస్తుందని, అవి మీ విద్య యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే క్షణాలుగా మిగులుతాయన్నారు. అదే విధంగా.. మీకు మద్దతునిచ్చిన మీ కుటుంబం, మీ మార్గదర్శకులు మరియు మీ తోటివారికి మీ కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. ఇంజనీర్ అవ్వడం అంటే చిన్న విషయం కాదన్నారు. మీరు ఎప్పుడు యథాతథ స్థితిని ప్రశ్నించడం నేర్చుకోవాలన్నారు. మన జీవితంలోని ప్రతి అంశం లోతైన విప్లవానికి లోనవుతోందన్నారు. ప్రతి మూలలో కొత్త ఆవిష్కరణలు వేళ్లూనుకుంటున్నాయి. మనం ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నప్పుడు సమాజంలోని వివిధ రంగాలలో సంభవించే విశేషమైన మార్పులను మనం అభినందించాలి. ఉత్సుకత ఎక్కడికి దారితీస్తుందో.. దాన్ని అన్వేషించండి. ఈ అన్వేషణకు భారతదేశం కంటే మెరుగైన ప్రదేశం మరొకటి లేదని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించు కోవాలన్నారు. కొత్త పద్ధతులను అనుసరించడం వల్ల మరింత సులువుగా లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఎప్పటి మాదిరిగానే మూస ధోరణిలో వెళ్లకుండా మార్పును స్వాగతించాలన్నారు.

ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు
12వ స్నాతకోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేసిన హైదరాబాద్లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఫౌండర్ అండ్ చైర్మన్ దొంతినేని శేషగిరి రావు, హైదరాబాద్లోని లోకేష్ మెషీన్స్ ఫౌండర్ ముల్లపూడి లోకేశ్వర రావు, ఇండియన్ కంపోజర్ అండ్ సింగర్ సాలూరి కోటేశ్వర రావు (కోటి)లకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది.

1539 మందికి డిగ్రీలు: విజ్ఞాన్స్ వర్సీటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ మాట్లాడుతూ.. 12వ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 1539 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసామన్నారు. వీటితోపాటు 60 ( అకడమిక్ గోల్డ్ మెడల్స్- 26, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డులు-24, చైర్మన్ గోల్డ్ మెడల్-1, లావు వెంకటేశ్వర్లు, బండారుపల్లి వెంకటేశ్వరరావు, ఆలపాటి రవీంద్రనాథ్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్స్-3, బెస్ట్ లీడర్-1, బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్-1, బెస్ట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్-1, విజ్ఞాన్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అకడమిక్ టాపర్స్-3) మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేసారు.

చిరస్మరణీయ వేదిక : హైదరాబాద్లోని లోకేష్ మెషీన్స్ ఫౌండర్ ముల్లపూడి లోకేశ్వర రావు
విద్యార్థుల మేధోపరమైన, విద్యాపరమైన అన్వేషణను వారి వృత్తిపరమైన విజయాలను కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవడానికి ఇది ఒక చిరస్మరణీయ వేదికని హైదరాబాద్ లోని లోకేష్ మెషీన్స్ ఫౌండర్ ముల్లపూడి లోకేశ్వర రావు అన్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో మీరు నేర్చుకున్న విద్యను నీతి సూత్రాలకు అనుగుణంగాను, వృత్తిపరమైన జ్ఞానం నిరంతర సమాజ అభివృద్ధిని జీవితకాల బాధ్యతగా విద్యార్థులు తీసుకోవాలన్నారు. ఎదిగిన మార్గాన్ని మర్చిపోవద్దు : విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మనం ఎప్పుడు కూడా ఇక్కడి వరకు ఎలా ఎదిగామన్న మార్గాన్ని మరిచిపోకూడదని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు మన మార్గం ప్రతిబింబించేలా ఉండాలన్నారు. ప్రస్తుతం మనం కొత్త శకం ప్రవేశంలో ఉన్నామని, ఏఐ ( ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్) మనం పని చేసే విధానం నుండి ఇతరులతో మనం కనెక్ట్ అయ్యే విధానం వరకు మన జీవితంలోని ప్రతి కోణాన్ని విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఏఐ అద్భుతమైన అవకాశాలను సృష్టించడంతో పాటు సవాళ్లను కూడా తీసుకువస్తుందన్నారు. ఏఐ పెరుగుదల వలన ఉద్యోగాలు కోల్పోవడం, సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు, భద్రతా సమస్యలు పెరుగుతాయన్నారు. మనం పాటించే విలువలు, సంప్రదాయాలు, ధరించే వస్త్రధారణలు భవిష్యత్ వారసత్వానికి చిహ్నాలని తెలియజేసారు. మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు.. మీ స్వంత రంగాలలో నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నారు. కేవలం మీ విభాగాల్లో నిపుణులుగా అవ్వడం మాత్రమే కాకుండా సామాజిక సమస్యలపై అవగాహన, అందరి పరిస్థితులను మెరుగుపరిచే అంకితభావం, పేదరికాన్ని నిర్మూలించడం, అక్షరాస్యతను ప్రోత్సహించడం, ఇతర సామాజిక సవాళ్లను పరిష్కరించడం వంటివి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా, మీరందరూ విజ్ఞాన్స్ యూనివర్సిటీలో నేర్చుకున్న విలువలను ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థులను కోరారు. స్థిరమైన లక్ష్యాల నిర్మాణానికి కృషి చేసి మీకు ఎంతో అందించిన సమాజం కోసం మీ వంతు కృషి చేయండన్నారు.

ప్రపంచంపై మీ ముద్రను వేయండి: విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు
నేడు పట్టభద్రులవుతున్న మీరందరూ ప్రపంచంపై మీ ముద్ర వేయడానికి ప్రయత్నించండని విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. నేటి స్నాతకోత్సవానికి అతిథులుగా హాజరైన వారందరూ ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏమి సాధించగలడు అనేదానికి ఉదాహరణలుగా తీసుకోవచ్చన్నారు. జస్టిస్ నరసింహ మరియు వినేష్ ఫోగట్ యొక్క కథలను మనం ప్రతిబింబించాలని, వారి ప్రయాణాలను మనం ముందుకు తీసుకురావడానికి ప్రేరణగా ఉపయోగించుకోవాలన్నారు. మీరు నేటి నుంచి సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని, మీరు సమాజ అభివృద్ధికి ఎలా దోహదపడతారో నిరంతరం ఆలోచించాలన్నారు. కలలను సాకారం చేసుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు. తోటి విద్యార్థులతో పోటీపడుతూ డిగ్రీ అభ్యసనాన్ని పూర్తిచేసిన మీరు సమాజానికి సహకార మందించి మీ ప్రయాణంలో సమృద్ధిగా విజయం సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు. నేటి యువతే రేపటి దేశం. యువతకు మించిన గొప్ప శక్తిలేదు. యువత సంకల్పం అన్నింటి కన్నా బలమైనదని చెప్పారు. యువత సరైన దిశలో గమ్యం వైపు పయనిస్తే బలమైన భారత్ ఎదుగుతుందన్నారు.

బంగారు పతకాల విజేతలు వీరే..
స్నాతకోత్సవం సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఆయా విభాగాల్లో సత్తా చాటిన 60 విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసింది. ప్రతిష్టాత్మక చైర్మన్స్ గోల్డ్ మెడల్ దీవి సింధు (బయోటెక్నాలజీ), లావు వెంకటేశ్వర్ల ఎండోమెంట్ అవార్డ్ జంగాల కుసుమ కుమారి ( సీఎస్ఈ), బండారుపల్లి వెంకటేశ్వరరావు అవార్డ్ జీ. ఆదిత్యవర్మ ( బయో ఇన్ఫర్మాటిక్స్), ఆలపాటి రవీంద్రనాథ్ ఎండోమెంట్ అవార్డ్- ముర్రా స్నేహలత (సీఎస్ఈ), బెస్ట్ లీడర్ అవార్డ్ – ఏ.కుశాల్ చౌదరి ( సీఎస్ఈ), బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ – తిరుమలశెట్టి పవన్ కుమార్ ( సీఎస్ఈ), బెస్ట్ ఎన్ఎస్ఎస్ అవార్డ్- షేక్ షకీరా (బయోటెక్నాలజీ) ఉన్నారు. వివిధ డిపార్ట్మెంట్ల నుంచి బెస్ట్ అవుట్గోయింగ్ స్టూడెంట్స్ బయెటెక్నాలజీ విభాగం నుంచి దీవి సింధు, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి వీరపనేని చైతన్య, సివిల్ నుంచి నోముల అమర్నాధ్, సీఎస్ఈ విభాగం నుంచి జంగాల కుసుమ కుమారి, ఈసీఈ నుంచి షేక్ బాజి, ఈఈఈ విభాగం నుంచి ముద్దు సాయిరాం, ఐటీ నుంచి జూహి కుమారి, మెకానికల్ విభాగం నుంచి పీ.రవిశంకర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ నుంచి టీ. భరత్ చంద్, టెక్స్టైల్ నుంచి వడియార గోపిచంద్, బయోఇన్ఫర్మాటిక్స్ విభాగం నుంచి గవిన్, ఆదిత్యవర్మ ఫుడ్ టెక్నాలజీ నుంచి గోంగల్ రెడ్డి జ్యోతిర్మయి, బీఎంఈ నుంచి నరిశెట్టి ఆమల, సీఎస్ఈ- ఏఐఎంఎల్ నుంచి కాకాని వంశీ, సీఎస్ఈ- సీఎస్ బీఎస్ నుంచి వేములూరి హేమంత్ కుమార్, సీఎస్ఈ- సైబర్ సెక్యూరిటీ నుంచి పూజిత తాడేపల్లి, ఫార్మసీ నుంచి షెహబాజ్ అలీ, బీసీఏ నుంచి కోకిరాల శివసాయి, బీబీఏ నుంచి వీ.సాయి ప్రియ, బీఎస్సీ నుంచి షేక్ నూరిద్దిన్ భాష, ఎంబీఏ నుంచి వై.మహిమ, ఎంసీఏ నుంచి ఇర్పాన్ సయ్యద్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ నుంచి కే.శ్రావణి ప్రియ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి షేక్ సర్దార్ జాని, తదితరులు బంగారు పతకాలు సాధించారు.

అంబరాన్నింటిన సంబరం
డిగ్రీలు చేతబట్టుకున్న వేళ విద్యార్థుల సంబరం అంబరాన్ని అంటింది. కేరింతలతో వర్సిటీ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. నాలుగేళ్ల తమ అనుభవాలను విద్యార్థులు ఒకరికొకరు పంచుకున్నారు. తరగతి గదుల్లో గడిపిన క్షణాలను నెమరువేసుకున్నారు. విశ్వవిద్యాలయంతో తాము పెంచుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సరదగా గడిపిన గడియలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ సంతోషంగా గడిపారు. గుర్తుగా సెల్ఫీలు దిగారు. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిన బూనారు. విద్యార్థులంతా తలపాగా, కండువా వేసుకుని అచ్చతెలుగు పెద్ద మనుషుల్లా కనిపించారు. సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూనే సాంకేతిక విద్యా సర్టిఫికెట్లను పొందారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ. నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, బోర్డు ఆఫ్ మేనేజిమెంట్ సభ్యులు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.