NTV Telugu Site icon

India-UAE Ties: సోమవారం భారతదేశానికి రానున్న యూఏఈ క్రౌన్ ప్రిన్స్..

India Uae Ties

India Uae Ties

India-UAE Ties: అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సెప్టెంబర్ 9-10న తన అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి రాబోతున్నారు. ఈ పర్యటనతో భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానునన్నాయి. ఆయనతో పాటు ఆ దేశ అగ్రమంత్రులు, వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్(63)కి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్(42) కుమారుడు.

అబుదాబి క్రౌన్ ప్రిన్స్, తదుపరి రాజు సోమవారం ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. యూఏఈ నుంచి భారతదేశాని తర్వాతి తరం రాజు రాబోతుండటం ఇదే మొదటిసారి. భారతదేశం, యూఏఈతో తన సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఈ పర్యటన హైలెట్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా కలవనున్నారు. సెప్టెంబర్ 09న, మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు యువరాజు రాజ్‌ఘాట్ వెల్లడంతో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి రోజు ఆయన పీఎం మోడీతో భేటీ కానున్నారు. ఇరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ భేటీలో పలు ఒప్పందాలు, ఎంఓయూలు కుదరనున్నాయి.

Read Also: Chhattisgarh: ఓవైపు యుపీలో తోడేళ్లు.. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో అయిదుగురిని పొట్టన బెట్టుకున్న గజరాజు

ద్వైపాక్షిక అంశాలతో పాటు ఇజ్రాయిల్-హమాస్ వివాదాన్ని కూడా ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని యువరాజు కలుస్తారు. సెప్టెంబర్ 10న, ముంబైలో జరిగే ఒక బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు ముంబైని సందర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు పాల్గొంటారు.

ప్రధానిగా నరేంద్రమోడీ 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015లో యూఏఈ పర్యటనకు వెళ్లారు. 34 ఏళ్ల తర్వాత భారత ప్రధాని అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు కొత్త పుంతలకు చేరురకున్నాయి. భారతదేశం యూఏఈకి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అదే విధంగా యూఏఈ అరబ్ ప్రపంచంలో భారత దేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అధికారిక సమాచారం ప్రకారం 2022-23లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 85 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022-23లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా ఎఫ్‌డీఐల పరంగా భారతదేశంలోని మొదటి నాలుగు పెట్టుబడిదారులలో యూఏఈ కూడా ఉంది.

ఇదే విధంగా యూఏఈలో 3.4 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య, సంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. యూఏఈ భారతదేశానికి చమురుని సరఫరా చేసే ఐదో అతిపెద్ద దేశం. పశ్చిమాసియాలో భారత ఎగుమతులకు యూఏఈ కేంద్రంగా ఉంది.