Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర ఎక్స్‌ఫర్ట్’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?

  • ప్రియాంక గాంధీ వ్యాఖ్యలతో చర్చలోకి వచ్చిన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్.
  • కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేసిన ప్రొఫెసర్ కామకోటి.
  • NSAB సభ్యుడిగా, AI టాస్క్ ఫోర్స్ మాజీ ఛైర్మన్‌గా సేవలు.
  • 150కు పైగా పరిశోధనా పత్రాలు, 50కు పైగా పరిశోధన ప్రాజెక్టులు.
  • DRDO సహా అనేక జాతీయ అవార్డులు అందుకున్న శాస్త్రవేత్త.
Prof V Kamakoti

Prof V Kamakoti

Prof V Kamakoti: పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన ‘‘గోమూత్ర నిపుణుడు’’ అనే వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ప్రభుత్వం విద్యా సంస్కరణపై ఏర్పాటు చేసిన హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రధానమంత్రి తన సలహాదారులను మార్చుకోవాలి. కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ కొత్త కమిటీలో మాజీ ఐబీ చీఫ్, ఒక ఐటీ కంపెనీ యజమాని, అలాగే ఒక ‘గోమూత్ర నిపుణుడు’ కూడా ఉన్నారు” అని ఆమె వ్యాఖ్యానించారు.

2025 జనవరిలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రొఫెసర్ కామకోటి మాట్లాడుతూ.. గోమూత్రానికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమెటరీ లక్షణాలు ఉన్నాయిన అన్నారు. దీనిపై శాస్త్రీయ పరిశోధనలు జరిగాయని చెప్పారు. అయితే, ఆయన తన వ్యాఖ్యలకు మద్దతుగా పీర్ రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురితమైన 5 శాస్త్రీయ అధ్యయనాలను ప్రస్తావించారు.

ప్రొఫెసర్ కామకోటి గొప్పతనం:

దేశంలో ప్రముఖ కంప్యూటర్ సైంటిస్టుల్లో కామకోటి ఒకరు. ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE)లో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2001లో ఐఐటీ మద్రాస్‌లో అధ్యాపకుడిగా చేరి, జనవరి 2022లో ఆ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, VLSI డిజైన్ రంగాల్లో ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. ప్రస్తుతం ఐఐటీ మద్రాస్‌లో మైక్రోప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. జాతీయ భదత్రా సలహా మండలి(NSAB) సభ్యుడిగా ఉన్నారు.

భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్ ఫోర్స్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) టెక్నాలజీ కమిటీలలో కూడా పనిచేస్తున్నారు.

ప్రొఫెసర్ కామకోటి 150కి పైగా పరిశోధనా పత్రాలను అంతర్జాతీయ జర్నల్స్, సదస్సుల్లో ప్రచురించారు. అనేక మంది పీహెచ్‌డీ, ఎంఎస్ పరిశోధకులకు మార్గదర్శకుడిగా వ్యవహరించారు. పరిశ్రమలు, ప్రభుత్వం పరిశోధనా సంస్థల కోసం దాదాపు 50 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. DRDO అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, IESA టెక్నో విజనరీ అవార్డు, ‘అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్’, ACCS లైఫ్-టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, IBM ఫ్యాకల్టీ అవార్డు, వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డులు అందుకున్నారు.