పశ్చిమ బెంగాల్లో జరిగిన మొదటి దశ పోలింగ్లో ఓటర్లు సునామీ సృష్టించారు. ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు జాతరలా తరలివచ్చారు. మునుపెన్నడూ లేనంతగా ఓటర్లు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక బెంగాల్లో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు బెంగాల్లో మూడు ప్రభుత్వాలు మారాయి. తొలుత కాంగ్రెస్.. అటు తర్వాత వామపక్షాలు.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఏలుబడి చేస్తోంది. ఈ మూడు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు.. ఎప్పుడూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఇదే తొలిసారి కావడం విశేషం.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గురువారం 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు 92.88 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా లెక్కలొచ్చాయి. గత ఎన్నికల కంటే 10 శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఎలక్షన్ ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ‘‘సర్’’పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అర్హుల ఓట్లు తొలగించారంటూ టీఎంసీ ఆరోపించింది. అయితే ఈసారి పోలింగ్ కోసం కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం దింపింది. దీంతో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి పోలింగ్లో పాల్గొన్నారు. పైగా కొత్త ఓటర్లు నూతనోత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. ఇక ఓటు వేయకపోతే ఓటు తొలగిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కారణంతో కూడా ఓటర్లు సునామీలా దూసుకొచ్చి ఓటేశారు.
ఇక 2011లో మమతా బెనర్జీ వామపక్షాల కంచుకోటను బద్ధలుకొట్టారు. అనూహ్యంగా మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక 2016లో కూడా మరోసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీ 59 సీట్లు గెలుచుకుంది. ఇక 2021లో జరిగిన ఎన్నికల్లో తిరిగి మమత అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆ ఎన్నికల్లో బీజేపీ 92 సీట్లు గెలుచుకుని బలమైన సందేశం పంపింది.
ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో 92 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 2011లో స్వల్ప శాతంతో మమత అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసొస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. మమతకు కలిసొస్తుందా? లేదంటే బీజేపీకి కలిసొస్తుందా? అన్నది మే 4న తేలిపోనుంది. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.
