Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం

  • తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం
  • రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
  • బాధిత కుటుంబానికి భారీ ఉపశమనం
Twisha Sharma

Twisha Sharma

హమ్మయ్య.. ఎట్టకేలకు తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో బాధిత కుటుంబానికి భారీ ఉపశమనం లభించింది. రెండో పోస్ట్‌మార్టం చేసేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఆమె భర్త సమర్థ్‌సింగ్ కూడా లొంగిపోవాలని సూచించింది. ఇక సమర్థ్‌సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయవాది ఉపసంహరించుకున్నాడు. త్వరలోనే ప్రధాన నిందితుడు సమర్థ్‌సింగ్ దిగువ కోర్టులో లొంగిపోనున్నాడు.

ఇక రెండో పోస్ట్‌మార్టం చేయాలన్న డిమాండ్‌పై కోర్టులో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పిటిషనర్ తరపు న్యాయవాదులు రెండో పోస్ట్‌మర్టం అవసరం అని పట్టుబట్టగా.. వ్యతిరేక పక్షం తీవ్రంగా వ్యతిరేకించారు. భోపాల్ ఎయిమ్స్ నిర్వహించిన పోస్ట్‌మార్టం సరిపోతుందని.. రెండో పోస్ట్‌మార్టం కోరడం వైద్య సమాజాన్ని అవమానించడమేనని వాదించారు. వైద్యుల సామర్థ్యంపై అవిశ్వాసం వ్యక్తం చేయడమేనని ఆరోపించారు. చివరికి వాదనలు అనంతరం రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశించింది.

నోయిడాలో నివాసం ఉండే ట్విషా శర్మకు… 2025 డిసెంబర్ 9న మధ్యప్రదేశ్‌‌లోని భోపాల్‌కు చెందిన క్రిమినల్ లాయర్ సమర్థ్‌సింగ్‌తో ఢిల్లీలో గ్రాండ్‌గా వివాహం జరిగింది. పెళ్లైన దగ్గర నుంచి కూడా వేధింపులకు గురవుతూనే ఉంది. ఈ నెల 12న భోపాల్‌లోని అత్తగారింట్లో ట్విషా శర్మ విగతజీవిగా కనిపించింది. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబం తల్లడిల్లిపోయింది. తమ కుమార్తెను అన్యాయంగా అత్తమామలు చంపేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ట్విషా శర్మ తన తల్లితో వాట్సాప్‌లో చాట్ చేసిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. భర్త సమర్థ్‌సింగ్, కుటుంబ సభ్యులు నిత్యం వేధిస్తున్నారని వాపోయింది. భర్త, అత్తమామలు నిరంతరం మానసిక వేధింపులు, శారీరక హింసకు గురి చేశారని తల్లడిల్లింది. మరణానికి ముందు మే 7న జరిగిన చాట్ వెలుగులోకి వచ్చింది. ఇక ట్విషా శర్మ వాట్సాప్ చాట్ వెలుగులోకి రావడంతో.. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ఎదుట నిరసనకు దిగింది. తమ కుమార్తెను చంపేసి.. ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు.

ఈ కేసులో అత్తగారు, రిటైర్డ్ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్‌కు చిక్కులు మొదలయ్యాయి. బెయిల్ రద్దు చేయాలని.. అలాగే సీబీఐ దర్యాప్తునకు మోహన్ యాదవ్ ప్రభుత్వం సిఫారస్సు చేసింది. ఇదే సమయంలో గిరిబాలా సింగ్‌కు భోపాల్ పోలీసులు తుది నోటీసు జారీ చేశారు. పలుమార్లు సమన్లు పంపినా దర్యాప్తుకు సహకరించలేదని ఆరోపిస్తూ విచారణ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మూడు నోటీసులు ఇచ్చామని.. అయినప్పటికీ గిరిబాలా సింగ్ స్పందించలేదని తెలిపారు. అందుకే ఆమె ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.

అయితే ఈ ఆరోపణలను గిరిబాలా సింగ్ ఖండించారు. తాను ముందుగా ఎలాంటి నోటీసులు అందుకోలేదని.. ఇటీవల వాట్సాప్ ద్వారా మాత్రమే సమాచారం వచ్చిందని చెప్పారు. “నేనూ నా వాంగ్మూలం ఇవ్వాలనుకుంటున్నాను” అని పేర్కొన్నారు.