NTV Telugu Site icon

AFSPA చట్టాల రద్దు అంశాన్నిపరిశీలించేందుకు ప్యానల్‌ ఏర్పాటు: అమిత్‌ షా

నాగాలాండ్ నుంచి AFSPA (ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌) ఉపసంహరణ అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర హోం శాఖ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం ఆమోదం తెలిపారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)రద్దు అంశంపై కేంద్రం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలోఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో, నాగాలాండ్ డిప్యూటీ సిఎం వై పాటన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, నాగా పీపుల్స్ ఫ్రంట్ లెజిస్లేచర్ పార్టీ (ఎన్‌పీఎఫ్‌ఎల్‌పీ) నాయకుడు టిఆర్ జెలియాంగ్ పాల్గొన్నారు. ఈ డిసెంబర్‌ 4వ తేదిన స్పెషల్‌ ఫోర్స్‌ అధికారులు దాడిలో సాధారణ పౌరులు మృతి చెందిన తర్వాత ఈ సమావేశం నిర్వహించారు. డిసెంబరు 4న నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని వోటింగ్‌ గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 14 మంది పౌరులతో పాటు ఒక సైనికుడు మరణించాడు. ఈ ఘటనపై మరోసారి ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాలపై దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

AFSPAపై కమిటీ చేయాల్సిన పనులు ఇవే..
ఈ కమిటీకి హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) అదనపు కార్యదర్శి (నార్త్ ఈస్ట్) నేతృత్వం వహిస్తారని నాగాలాండ్ సీఎం నేఫియూ రియో ​​మీడియాకు తెలిపారు.ఈ కమిటీ 45 రోజులలోపు నివేదికను సమర్పిస్తుంది. దీని ఆధారంగా నాగాలాండ్‌ నుంచి ఈ చట్టాల ఉపసంహరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

వోటింగ్ గ్రామంలో జరిగిన ఘటనలో పాల్గొన్న ఆర్మీ అధికారులపై ఆర్మీ కోర్టులో ప్రత్యేక విచారణ చేపట్టడంతో పాటు వారిపై చర్యలను తీసుకుంటారు. విచారణ ఎదుర్కొంటున్న ఆర్మీ అధికారులను సస్పెండ్‌ చేస్తారు. వోటింగ్‌ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యలకు రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంది. ప్రత్యేక అధికారాల చట్టాలను నాటి రాష్ర్టపతి రాజేంద్రప్రసాద్‌ ఆమోదించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఈ సాయుధ దళాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను ప్రభుత్వం కల్పించింది.