Tata-Airbus: భారత గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మక్రాన్ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జైపూర్ నగరంలో ఆయనను ఆప్యాయంగా ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడేందుకు ఈ పర్యటన దోహదం చేసింది. ఇప్పటికే భారత్ ఫ్రాన్స్ నుంచి రాఫేల్ వంటి బిగ్ డీల్స్ చేసుకుంది. ముఖ్యంగా వైమానిక, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడనున్నాయి.
తాజాగా టాటా-ఎయిర్ బస్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రెండు సంస్థలు కలిసి ఎయిర్ బస్ సివిల్ హెలికాప్టర్లను తయారు చేయనున్నాయి. భారత్ లోనే స్థానికీకరణను ప్రోత్సహించే చర్యల్లో భాగంగానే ఈ ఒప్పందంపై సంతకం చేశామని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా శుక్రవారం తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ భారత్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు.