Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన

  • తమిళనాడు రాజకీయాల్లో వీడియో దుమారం
  • తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం
  • మంత్రి కీర్తన ఘాటు స్పందన
Tamil Nadu2

Tamil Nadu2

తమిళనాడు రాజకీయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కారులో నుంచి బయటకు వస్తున్న ఓ మహిళను టీవీకే ప్రభుత్వంలోని పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి ఎస్. కీర్తనగా సోషల్ మీడియాలో కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఆ వీడియోలో ఉన్న మహిళ తాను కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో మహిళల దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛపై జరుగుతున్న చర్చను తీవ్రంగా తప్పుబట్టారు.

శివకాశి ఎమ్మెల్యే అయిన కీర్తన మాట్లాడుతూ.. ఈ ఘటన “తిరోగమన, బలహీనమైన ఆలోచనా ధోరణికి” నిదర్శనమని విమర్శించారు. ఒక మహిళ దుస్తులు, రూపురేఖలు లేదా ఆమె సంతోషంగా ఉండటం కూడా రాజకీయ అంశంగా ఎందుకు మారుతున్నాయని ప్రశ్నించారు. “అది నేనే అయినా కూడా ఎందుకు అంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఒక మహిళ దుస్తులు, రూపం లేదా ఆమె ఆనందాన్ని ఇప్పటికీ ప్రజా విచారణకు గురిచేయాల్సిన అంశాలుగా ఎందుకు చూస్తున్నారు?” అని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

వివాదం ఎలా మొదలైంది?

సోషల్ మీడియాలో కొన్ని ఖాతాల నుంచి ఈ వీడియోను షేర్ చేస్తూ.. అందులో కనిపిస్తున్న మహిళ కీర్తననేనా? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఆ వీడియోలో సదరు మహిళ పొట్టి నల్లటి దుస్తులు ధరించి కనిపించారు. దీంతో ఆమె దుస్తులపై కూడా కొందరు తీవ్ర వ్యాఖ్యలు, ట్రోలింగ్ చేశారు. అయితే వీడియోలో ఉన్న మహిళ తాను కాదని కీర్తన స్పష్టం చేశారు. తనను పోలి ఉండటంతో సంబంధం లేని మహిళను కూడా ఈ వివాదంలోకి లాగారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళకు క్షమాపణలు చెబుతూ.. “మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు నచ్చిన విధంగా, మీ స్వేచ్ఛతో జీవించడం కొనసాగించాలని కోరుకుంటున్నాను” అంటూ ఆమెకు మద్దతు తెలిపారు.

ఈ వ్యవహారంపై కీర్తన ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయడం కొత్తేమీ కాదని అన్నారు. “మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉన్న నాయకుడి అనుచరుల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?” అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలు, పనితీరుపై విమర్శించడానికి సరైన అంశాలు లేనప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. “సానుకూలంగా చెప్పడానికి, చేయడానికి ఏమీ లేని వారి వద్ద మహిళా వ్యతిరేక ధోరణి అత్యంత పురాతన ఆయుధం” అని కీర్తన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

డీఎంకే స్పందన

కీర్తన వ్యాఖ్యలపై డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి టీఆర్‌బీ రాజా కూడా స్పందించారు. మహిళలను వారి వ్యక్తిగత ఎంపికల కారణంగా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధించడం అసహ్యకరమని అన్నారు. “మహిళలను, వారి వ్యక్తిగత ఎంపికలను కించపరిచేందుకు కొందరు ప్రయత్నించడం చాలా బాధాకరం. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా ఇందులోకి లాగుతున్నారు” అని రాజా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మహిళల గౌరవం, హక్కులు, స్వేచ్ఛకు డీఎంకే ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మర్యాద హద్దులు దాటే ఎలాంటి చర్యలను అయినా సహించబోమని పేర్కొన్నారు.

కీర్తన ఆరోపణలు

మరో కార్యక్రమంలో మాట్లాడిన కీర్తన.. డీఎంకే, ఏఐఏడీఎంకేలు సోషల్ మీడియాలో మహిళలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతి వారాంతంలోనూ తమ పని తప్పుడు ప్రచారాలు చేయడమేనని విమర్శించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న మహిళ తాను కాదని మరోసారి స్పష్టం చేశారు. ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో సోషల్ మీడియా ట్రోలింగ్, మహిళల వ్యక్తిగత గోప్యత, దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛపై రాజకీయ దాడులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.