Tamil Nadu Govt: తమిళనాడులో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్.. సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు.. రాష్ట్ర ఆరోగ్య రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 8,000 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రారంభించేందుకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య సేవలు మరింత విస్తరించనున్నాయని అధికారులు భావిస్తున్నారు. చెన్నైలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్రాజ్, ఆస్పత్రుల అనుమతి ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆస్పత్రులు ప్రారంభించదలిచిన నిర్వాహకులు అవసరమైన వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వెంటనే తాత్కాలిక ధృవపత్రాలు జారీ చేయనున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు అనుమతుల కోసం ఆస్పత్రి యాజమాన్యాలు అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే, కొత్త విధానంతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు, త్వరితగతిన అనుమతులు పొందే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. మంత్రి అరుణ్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం, తాత్కాలిక అనుమతుల తర్వాత సంబంధిత ఆస్పత్రులపై పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహిస్తారు. మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది, భద్రతా ప్రమాణాలు, పరికరాల నాణ్యత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత మాత్రమే శాశ్వత ధృవపత్రాలు జారీ చేయబడతాయి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశముందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆరోగ్య రంగంలో పెద్ద మార్పులకు దారితీసే అవకాశముందని రాజకీయ, వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.
