Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA

Sugar Shortage

Sugar Shortage

Sugar Shortage: దేశంలో చక్కెర కొరత ఏర్పడుతోందన్న వార్తల నేపథ్యంలో ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ (AISTA) కీలక స్పష్టత ఇచ్చింది. మార్కెట్‌లో చక్కెర కొరత ఉందనే ప్రచారం వాస్తవం కాదని, దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఇటీవల నెల రోజుల వ్యవధిలో ఫ్యాక్టరీ స్థాయిలో చక్కెర ధరలు సుమారు 15 శాతం పెరగడంతో మార్కెట్‌లో కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, అయితే దీన్ని సరఫరా సంక్షోభంగా భావించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

AISTA తెలిపిన వివరాల ప్రకారం, జూలై 17న ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ (NFCSF) సంయుక్తంగా దేశంలో తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశాయి. అంతేకాకుండా, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే 2026–27 చెరకు క్రషింగ్ సీజన్‌ను ముందుగానే ప్రారంభించేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉందని తెలిపాయి. దీంతో మార్కెట్‌లో కొత్త చక్కెర త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఈ గందరగోళంపై AISTA ఛైర్మన్ ప్రఫుల్ విఠలానీ మాట్లాడుతూ, ధరల పెరుగుదలతో మార్కెట్‌లో అనవసరమైన భయాందోళనలు నెలకొన్నాయని, కానీ చక్కెర కొరత లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా చక్కెర సరఫరా సజావుగా కొనసాగేందుకు చక్కెర మిల్లులు, వ్యాపారులు, టోకు విక్రేతలు, పంపిణీదారులు, సంస్థాగత కొనుగోలుదారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. కోవిడ్-19 సమయంలో కూడా పరిశ్రమ ఎలాంటి సరఫరా అంతరాయం లేకుండా చక్కెర అందుబాటులో ఉంచిందని గుర్తు చేసిన విఠలానీ, ఇప్పుడు కూడా అదే బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. నిల్వలు పెంచుకోవడం, పుకార్లను నమ్మడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, మార్కెట్‌లో చక్కెర లభ్యతపై అపోహలు సృష్టించవద్దని సూచించారు.

పరిశ్రమ సంఘాల ప్రకారం, దేశంలో ప్రస్తుతం చక్కెర నిల్వలు తగినంతగా ఉన్నాయి. రాబోయే చెరకు కోత, క్రషింగ్ ప్రక్రియలు అనుకూల వాతావరణంలో సాగితే సరఫరా మరింత మెరుగుపడే అవకాశముందని పేర్కొంటూ, వినియోగదారులు కొరతపై అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు AISTA ఛైర్మన్ ప్రఫుల్ విఠలానీ.. అయితే, చక్కెర మిల్లులు, వ్యాపారులు, సంస్థాగత కొనుగోలుదారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, కార్యకలాపాలను సజావుగా కొనసాగించాలని, పరిశ్రమ సంఘాల హామీలపై విశ్వాసం ఉంచాలని విజ్ఞప్తి చేశారు.