Saharanpur Mosque: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో సహరాన్పూర్ కలెక్టరేట్లో ఉన్న మసీదు కూల్చివేత విషయం రచ్చకు కారణమైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, కూల్చివేసిన మసీదు కింద ఒక పురాతన బావి బయటపడటం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ బావిని పరిశీలించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు సోమవారం వచ్చారు. బావి ఎప్పటిది, నిర్మాణ స్వభావం, చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తించడమే తమ ఉద్దేశమని ఆర్కియాలజీ అధికారులు చెబుతున్నారు.
ASI అధికారుల పరిశీలనలో ఈ బావిని లఖోరీ ఇటుకలతో నిర్మించినట్లు తెలిపారు. ఇటుకల్ని కలిపేందుకు సున్నం-సుర్ఖీ మిశ్రమాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. సుమారు 20 అడుగుల లోతు, 3 అడుగుల వ్యాసం ఉన్నట్లు గుర్తించారు. పైబాగం నుంచి సుమారు 3 అడుగుల లోతు పలుచటి సున్నం వేసినట్లు కనిపించినట్లు చెప్పారు. ఇలాంటి నిర్మాణ పద్ధతి ఉన్న బావులు ఎగువ, మధ్య గంగా లోయ ప్రాంతాల్లో కనిపిస్తాయని, ఇవి సాధారణంగా తర్వాతి మధ్యయుగ కాలంతో సంబంధం ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు. అయితే, బావి ఖచ్చితమైన వయస్సు, చారిత్రక నేపథ్యం పూర్తి పరిశీలన తర్వాతే తేలనుంది.
సహరాన్పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదును కోర్టు ఆదేశాలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కూల్చేసింది. శిథిలాలు తొలగిస్తున్న సమయంలో నేల కింద ఒక స్లాబ్ కనిపించింది. దాన్ని కట్టర్తో తొలగించగా ఒక బావి బయటపడింది. మసీదును ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినట్లు అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించిన తర్వాత కూల్చివేత జరిగింది. ప్రస్తుతం బయటపడిన బావి చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు.

