Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు

  • ‘రామ మందిర నిర్వహణ అద్భుతం’
  • రామ మందిర ట్రస్ట్ కొత్త సీఈవో జితేంద్ర మిశ్రా కితాబు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న జితేంద్ర మిశ్రా
Jeetendra Mishra

Jeetendra Mishra

అయోధ్య రామ మందిరం నిర్వహణ ఇప్పటివరకు అత్యంత అద్భుతంగా సాగిందని.. అక్కడక్కడా ఎదురైన చిన్నపాటి సమస్యలు మినహా ఎలాంటి ఇబ్బంది లేదని రామ మందిర ట్రస్ట్ కొత్త సీఈవోగా నియమితులైన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా కితాబు ఇచ్చారు. ప్రస్తుతం కొన్ని అంశాలపై దర్యాప్తు జరుగుతోందని.. వాటి ఫలితం ఏంటో వేచి చూడాల్సి ఉందని పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం వహించిన ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి సీఈవోగా నియమితులయ్యారు. రామ మందిర నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కొత్త పదవిని ఏర్పాటు చేశారు. నియామకం తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడిన జితేంద్ర మిశ్రా.. ఇప్పటివరకు ఆలయ నిర్వహణ, పరిపాలన చాలా బాగా సాగిందని అన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన సీఈవో పదవికి సంబంధించిన బాధ్యతలపై కూడా మిశ్రా స్పందించారు. తన పాత్ర, బాధ్యతల గురించి ఇప్పటికే తెలుసుకున్నానని, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ‘‘సీఈవో బాధ్యతల విషయానికి వస్తే.. అవి ఇంటర్నెట్‌లో, బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి. వాటిని నేను పరిశీలించాను. శ్రీరాముడి ఆశీస్సులు, ట్రస్ట్ మార్గదర్శకత్వం, నా బృందం సహకారంతో నా భుజాలపై ఉంచిన బాధ్యతలకు న్యాయం చేయగలనని చాలా నమ్మకంగా ఉన్నాను. కనీసం నా వంతు శాయశక్తులా ప్రయత్నిస్తాను” అని మిశ్రా చెప్పారు.

కీలక నియామకం

62 ఏళ్ల జితేంద్ర మిశ్రా నియామకం రామ మందిర విరాళాల అవకతవకల ఆరోపణలు తెరపైకి వచ్చిన సమయంలో జరిగింది. ఆలయ విరాళాల సొమ్ము దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.

సీఈవో పదవికి ట్రస్ట్‌కు మొత్తం 5,585 దరఖాస్తులు వచ్చాయి. చివరకు ముగ్గురు అభ్యర్థులతో కూడిన తుది జాబితా నుంచి జితేంద్ర మిశ్రాను ఎంపిక చేశారు. ఈ ఎంపిక ప్రక్రియకు రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణ వహించింది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, మాజీ శాస్త్రవేత్త సురేశ్ హవారే కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన తుది నివేదికను ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరికి మంగళవారం సమర్పించింది. కమిటీ కార్యదర్శి సమీర్ పాండా మాట్లాడుతూ.. నాయకత్వ సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యం, నిజాయితీ, భవిష్యత్ దృక్పథం వంటి అంశాలను పరిశీలించిన అనంతరం అత్యంత అర్హత కలిగిన ముగ్గురు నిపుణులను సిఫారసు చేసినట్లు తెలిపారు.

ఏఐతో స్క్రీనింగ్.. 

సీఈవో ఎంపిక ప్రక్రియలో తొలుత ఏఐ ఆధారిత స్క్రీనింగ్, ఆ తర్వాత మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించారు. త్తం 5,585 మంది దరఖాస్తుదారుల్లో 3,577 మంది 600 మార్కుల మూల్యాంకన విధానంలో తమ వివరాలను సమర్పించారు. అనంతరం కనీసం 470 మార్కులు సాధించిన 108 మందిని తదుపరి దశకు ఎంపిక చేశారు. వీరితో వర్చువల్ ఇంటరాక్షన్స్ నిర్వహించిన తర్వాత.. చివరకు 16 మంది అభ్యర్థులను అయోధ్యకు పిలిపించి ఆగస్టు 11, 12 తేదీల్లో వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో ముగ్గురిని తుది జాబితాకు ఎంపిక చేయగా.. జితేంద్ర మిశ్రాను తొలి సీఈవోగా నియమించారు. విరాళాల సొమ్ము దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ నిర్వహించిన మూడో సమావేశంలో ఈ నియామకాన్ని ప్రకటించారు.

39 ఏళ్లకు పైగా వైమానిక దళంలో సేవలు

ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాకు చెందిన జితేంద్ర మిశ్రా 2026 ఏప్రిల్ 30న భారత వైమానిక దళం నుంచి రిటైర్ అయ్యారు. ఆయన 39 ఏళ్లకు పైగా సేవలందించారు. 1986 డిసెంబర్ 6న ఫైటర్ పైలట్‌గా కమిషన్ పొందిన ఆయన.. తన కెరీర్‌లో 3,000 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవాన్ని సంపాదించారు. కమాండ్, టెస్టింగ్, వ్యూహాత్మక విభాగాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆపరేషన్ సిందూర్‌లో ఆయన పాత్రకు గుర్తింపుగా సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ అందుకున్నారు. అలాగే అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ కూడా ఆయనకు లభించాయి.

ఆపరేషన్ సిందూర్ సమయంలో

జితేంద్ర మిశ్రా 2025 జనవరి 1న వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ కమాండ్.. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళంలోని కీలక ఆపరేషనల్ కమాండ్లలో ఒకటిగా ఉంది. అంతకుముందు ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఆపరేషన్స్)గా పనిచేశారు. తన కెరీర్‌లో ఫైటర్ స్క్వాడ్రన్‌తో పాటు రెండు ఫ్రంట్‌లైన్ ఎయిర్‌బేస్‌లకు కమాండ్ చేశారు. అలాగే Aircraft and Systems Testing Establishment (ASTE) కమాండెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో కూడా పలు కీలక పదవుల్లో పనిచేశారు. వాటిలో Operational Planning and Assessment Group డైరెక్టర్ బాధ్యతలు కూడా ఉన్నాయి.

అనేక కీలక బాధ్యతలు

IAF ప్రకారం.. మిశ్రా కెరీర్‌లో ASTEలో చీఫ్ టెస్ట్ పైలట్, రెండు ఫ్రంట్‌లైన్ ఎయిర్‌బేస్‌లకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, ప్రిన్సిపల్ డైరెక్టర్ (ASR), ఎయిర్ హెడ్‌క్వార్టర్స్ (VB)లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్), డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (డాక్ట్రిన్, ఆర్గనైజేషన్ అండ్ ట్రైనింగ్) వంటి బాధ్యతలు చేపట్టారు. జితేంద్ర మిశ్రా పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్, అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో విద్య, శిక్షణ పొందారు.

మిశ్రా రిటైర్మెంట్ సందర్భంగా వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఆయన నాయకత్వాన్ని ప్రశంసించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కమాండ్‌ ఆపరేషనల్ సన్నద్ధతను మరింత బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొంది. ఆయన వ్యూహాత్మక దృష్టిని కూడా WAC ప్రశంసించింది. ఇప్పుడు రామ మందిర ట్రస్ట్ తొలి సీఈవోగా జితేంద్ర మిశ్రా బాధ్యతలు చేపట్టనుండటంతో.. ఆలయ పరిపాలనను మరింత వ్యవస్థీకృతంగా నిర్వహించడంలో ఆయన అనుభవం కీలకంగా మారనుంది.