Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్‌..!

Vasundhara Raje

Vasundhara Raje

Rajasthan Local Body Elections: రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార భారతీయ జనతా పార్టీ మిశ్రమ ఫలితాలను చవిచూసింది.. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య హోరాహోరీ పోరును చూపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజేకు కంచుకోటగా భావించే ఝలావర్‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్‌లోని 45 వార్డుల్లో కాంగ్రెస్ ఏకంగా 29 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది.

ఝలావర్ జిల్లాలోని మొత్తం ఎనిమిది మున్సిపల్ సంస్థల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించింది. ఝలావర్‌తో పాటు భవానీ మండి, ఖాన్‌పూర్, డాగ్ మున్సిపల్ సంస్థలను కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు బీజేపీ ఝల్రాపటన్, అక్లేరా, మనోహర్తానా మున్సిపాలిటీల్లో మాత్రమే మెజారిటీ సాధించింది. పిడావాలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్‌మేకర్‌గా మారింది.

ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ జెండా
ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్‌లోని 45 వార్డుల ఫలితాల్లో కాంగ్రెస్ 29 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ కేవలం 13 వార్డులకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. కౌన్సిల్‌లో మెజారిటీకి అవసరమైన 23 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ 29 సీట్లతో సులభంగా అధిగమించింది. దీంతో ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ బోర్డు ఏర్పాటు చేయడం ఖాయమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కూడా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది. గతంలో ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ బోర్డు ఉండేది. దానిని కాంగ్రెస్ కూలదోసి తిరిగి తన ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

వసుంధరా రాజే రాజకీయ కోటకు దెబ్బ
ఝలావర్, ఝల్రాపటన్ ప్రాంతాలు దశాబ్దాలుగా మాజీ సీఎం, కీలక నేతగా ఉన్న వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ రాజకీయంగా బలమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ 29 వార్డులు గెలవడం బీజేపీకి, ముఖ్యంగా వసుంధరా రాజేకు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.. ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్ ఝలావర్-బరన్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. దుష్యంత్ సింగ్ ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు ముందు వసుంధరా రాజే కూడా ఇదే లోక్‌సభ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పేలవమైన ఫలితాలకు అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి, అంతర్గత వర్గపోరాటాలు కారణమై ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2028 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు రాజకీయంగా, మానసికంగా మంచి ఊతమిచ్చినట్లుగా భావిస్తున్నారు.

మూడు మున్సిపాలిటీల్లోనే బీజేపీ మెజారిటీ
వసుంధరా రాజే ప్రస్తుతం ఝలావర్ జిల్లాలోని ఝల్రాపటన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ మాత్రం బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఝల్రాపటన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ ఎనిమిది, ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలు సాధించాయి. అక్లేరా మున్సిపాలిటీలో బీజేపీ 25 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ ఎనిమిది, స్వతంత్రులు రెండు స్థానాలు దక్కించుకున్నారు. మనోహర్తానాలో మొత్తం 20 స్థానాలకు గాను బీజేపీ 11, కాంగ్రెస్ ఆరు, స్వతంత్రులు మూడు సీట్లు గెలుచుకున్నారు.

భవానీ మండి, డాగ్, ఖాన్‌పూర్‌లో కాంగ్రెస్ హవా
ఝలావర్‌తో పాటు భవానీ మండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 26 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 13 స్థానాలకు పరిమితమైంది. ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. ఖాన్‌పూర్‌లో కాంగ్రెస్ 18 సీట్లు, బీజేపీ ఏడు సీట్లు గెలుచుకున్నాయి. అలాగే డాగ్‌లో కాంగ్రెస్ 14 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ ఆరు స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక, పిడావా మున్సిపాలిటీలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ ఎనిమిది స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ ఆరు సీట్లు గెలుచుకుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలు సాధించడంతో కీలకంగా మారింది. ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. దీంతో పిడావాలో బోర్డు ఏర్పాటులో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు కీలకం కానుంది. మొత్తంగా చూస్తే, వసుంధరా రాజేకు బలమైన రాజకీయ స్థావరంగా భావించే ఝలావర్ జిల్లాలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలు రాజస్థాన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.. ఇది మాజీ సీఎం వసుంధరా రాజేకు భారీ షాక్‌గా అభివర్ణిస్తున్నాయి..