Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పాను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ

  • ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
  • నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పాను
  • ఓ విద్యార్థి అభిప్రాయాన్ని సభలో ప్రస్తావించిన ప్రతిపక్ష నేత
Rahulgandhi

Rahulgandhi

విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా పదే పదే ‘ఇడియట్స్’ అంటూ సంబోధించారు. దీంతో అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అనంతరం ఇదే అంశంపై ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘‘క్షమాపణ చెబితేనే మళ్లీ మాట్లాడేందుకు అనుమతిస్తారని నాకు చెప్పారు. అన్నింటికన్నా ముందు నేను ఆర్‌ఎస్‌ఎస్‌కు, బీజేపీకి ఎప్పటికీ క్షమాపణ చెప్పను. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను లేవనెత్తడం నా హక్కు.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

‘‘ఢిల్లీలో విద్యార్థులను కొట్టడమే నాకు అత్యంత ముఖ్యమైన విషయం. పెల్లెట్ గన్‌లను ఉపయోగించారు. మేకులు దింపిన కర్రలతో మైనర్లపై దాడి చేశారు. విద్యార్థుల ముఖాలను గుర్తిస్తున్నారు, బజరంగ్ దళ్‌పై ఆరోపణలు చేస్తున్నారు. పలువురు విద్యార్థులను పెల్లెట్ గన్‌లతో కొట్టారని పేర్కొన్న వైద్య ధృవపత్రాలను నేను చూశాను. పిల్లలను మేకులు దింపిన కర్రలతో కొట్టారు. కొట్టిన వారు సాదా దుస్తుల్లో ఉన్న పోలీసులని చెబుతున్నారు.’’ అని తెలిపారు.

విద్యార్థులకు న్యాయం చేస్తాం

‘‘జూలై 25న నేను హోం మంత్రికి లేఖ రాసి.. పెల్లెట్ గన్‌ల వాడకానికి అనుమతి ఇచ్చారా లేదా అని అడిగాను. ఒకవేళ మీరు ఇవ్వకపోతే, మరి ఎవరు ఇచ్చారు?’’ అని అడిగాను. ‘‘నా లేఖకు కనీసం స్పందన కూడా రాలేదు. విద్యార్థులు దారుణంగా హింసించబడ్డారు. దెబ్బలు తిన్న విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము విశ్రమించం. ఈ పని ఏ పోలీసు అధికారులు చేశారో మాకు తెలుసు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రతిపక్షం హామీ ఇస్తోంది. ప్రధాని మోడీ.. అమిత్ షాను పదవి నుంచి తొలగించి… ఈ మొత్తం విషయంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ మొత్తం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే..


బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ.. పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీలతో యువతలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రస్తావించారు. ఈ సందర్భంగా 18 ఏళ్ల ఓ విద్యార్థితో తాను జరిపిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. ఆ విద్యార్థి సమాజంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారని చెప్పాడని వివరించారు. ‘‘విద్యార్థులు, ఇడియట్స్, ఆ ఇడియట్స్‌ను అనుసరించే అంధభక్తులు’’ అని ఆ విద్యార్థి వ్యాఖ్యానించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. అయితే రాహుల్ గాంధీ ‘ఇడియట్స్’ అనే పదాన్ని ఉపయోగించడంపై కిరణ్ రిజిజు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదం పార్లమెంటరీ భాషకు అనుగుణంగా లేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ అదే పదాన్ని పదేపదే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఆయన అదే పదాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారు’’ అని కిరణ్ రిజిజు అన్నారు. దీంతో అధికార పక్ష సభ్యులు నిరసనలు వ్యక్తం చేయగా.. ఇరువర్గాల సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. తాను వ్యక్తిగతంగా ఎవరినీ ‘ఇడియట్’ అని సంబోధించడం లేదని స్పష్టం చేశారు. ‘‘నేను ఎవరినీ అలా పిలవడం లేదు. వేరే పదాన్ని ఉపయోగిస్తాను’’ అని చెప్పారు. అయితే రిజిజు మరోసారి స్పందిస్తూ.. ‘‘మీరు పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన పదాన్ని ఉపయోగించారు. అందుకే మేం అభ్యంతరం వ్యక్తం చేశాం’’ అని అన్నారు.

అనంతరం రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఆ విద్యార్థి చెప్పిన మరో వ్యాఖ్యను ప్రస్తావించారు. ‘‘నిజమైన విద్యార్థి తన నిజాయతీని తన హృదయంలో ఉంచుకుంటాడు. ఇతరులకు ఒక ఇమేజ్ అవసరం. ఆ వ్యక్తి తాను దేవుడినని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నందున తన కోసం భారీ ఇమేజ్‌ను నిర్మించుకోవాల్సి వస్తోంది’’ అని విద్యార్థి చెప్పినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో అధికార పక్ష సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. అనంతరం స్పీకర్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.