NTV Telugu Site icon

Rahul gandhi: ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి అవమానం!.. స్వతంత్ర్య వేడుకల్లో చివరిలో సీటు

Rahulgandhilop

Rahulgandhilop

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని మోడీ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వాస్తవానికి పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కింది. ఇండియా కూటమి రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. అధికారికంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అంటే కేంద్ర మంత్రికి ఉండే గౌరవం రాహుల్‌కి దక్కుతుంది. ఇక వాజ్‌పేయ్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత సోనియాగాంధీకి ముందు వరుసలోనే సీటు కేటాయించారు. కానీ మోడీ 3.0 ప్రభుత్వం మాత్రం రాహుల్‌ను అవమానించేలా వెనుక వరుసలో సీటు కేటాయించారని.. అది కూడా ఒలింపిక్స్ క్రీడాకారుల వెనుక కూర్చోబెట్టడం ఏంటి? అని నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాహుల్ సీటు కేటాయింపుపై సర్వత్రా తీవ్ర చర్చ సాగుతోంది.

ఇది కూడా చదవండి: OLA: ఓలా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 579 కి.మి!

రాహుల్ సీటుపై తీవ్ర దుమారం చెలరేగడంతో రక్షణ శాఖ స్పందించింది. ఎర్రకోట దగ్గర రక్షణ శాఖే ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కేంద్రమంత్రులతో సమానంగా ముందు వరుసలోనే సీటు కేటాయించామని.. అయితే తాను ఒలింపిక్స్ క్రీడాకారుల దగ్గర కూర్చుంటానని రాహుల్ చెప్పడంతోనే అలా జరిగిందని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. ముందు వరుసలో కేంద్రమంత్రులు అమిత్ షా, జై శంకర్, నిర్మలా సీతారామన్, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, తదితరులు కూర్చున్నారు.

అయితే ఈ విషయంపై రాహుల్ స్పందించారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. నేను ఎక్కడ ఉన్నా.. మీతోనే ఉంటా. మీలాగే ఉంటా. నిరంతరం భారతీయుల గొంతుకను అవుతాను’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: తగ్గుతున్న హిందూ జనాభా.. అస్సాం భవిష్యత్తు ప్రమాదంలో ఉంది..