NTV Telugu Site icon

Rahul Gandhi: మా హయాంలో రెండొచ్చేవి.. ఇప్పుడు ఒక్కటే వస్తుంది..!!

Rahul Gandhi

Rahul Gandhi

వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే ప్రస్తుతం వంట గ్యాస్ ధరలు రెండింతలు అయ్యాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో ధరలతో పోల్చి చూపిస్తూ రాహూల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు.

2014లో 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉండేది అని.. దీని ధర ప్రస్తుతం రూ.999కి చేరిందని.. అంటే సుమారు రూ.585 పెరిగిందని రాహుల్ గాంధీ వివరించారు. ఇప్పుడున్న ధరతో తమ హయంలో రెండు గ్యాస్ సిలిండర్లు వచ్చేవి అని.. ఇప్పుడు మాత్రం ఒక్కటే వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఒక్కొక్క సిలిండర్‌పై రూ.827 రాయితీ ఇచ్చిందన్నారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలించే సత్తా కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.