PM Modi Paris Speech: ఫ్రాన్స్ రాజధాని పారిస్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గత 12 ఏళ్లలో భారతదేశం సాధించిన అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. ఈ కాలం 140 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం, సంకల్పం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో భారతదేశ జీడీపీ రెట్టింపు కాగా, దేశంలోని విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా రెండింతలు పెరిగిందని మోడీ తెలిపారు. రహదారుల నిర్మాణ వేగం మూడింతలు పెరగగా, మెట్రో రైలు నెట్వర్క్ నాలుగింతలు విస్తరించిందన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు.
ఎగుమతుల రంగంలో కూడా దేశం గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధాని మోడీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయని, మొబైల్ ఫోన్ తయారీ యూనిట్ల సంఖ్య 100 రెట్లు పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. తయారీ రంగంలో భారత్ ప్రపంచానికి ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు. ఆర్థిక పురోగతితో పాటు సామాజిక మార్పు కూడా దేశంలో స్పష్టంగా కనిపిస్తోందని మోడీ అన్నారు. గత 12 సంవత్సరాల్లో సుమారు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.
పేదల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, ఫ్రాన్స్లో ఉన్న మొత్తం ఇళ్ల సంఖ్య కంటే ఎక్కువ శాశ్వత గృహాలను భారతదేశంలో నిరుపేదల కోసం నిర్మించామని తెలిపారు. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా అందుబాటులోకి రావడంతో ఆర్థిక సమ్మిళితం ఒక సామాజిక ఉద్యమంగా మారిందన్నారు. దేశ అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన విజయంగా భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని ప్రధాని అభివర్ణించారు. నేటి భారత యువత పెద్ద కలలు కనడానికి వెనుకాడటం లేదని, రైతులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని, మహిళలు వివిధ రంగాల్లో నాయకత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ 12 సంవత్సరాలు భారతదేశ ఆకాంక్షలను కొత్త శిఖరాలకు చేర్చిన కాలంగా నిలిచాయని పేర్కొన్నారు ప్రధాని మోడీ.
గ్రామీణాభివృద్ధిపై మాట్లాడుతూ, ఒకప్పుడు మారుమూల గ్రామాలకు ఆధునిక సౌకర్యాలు అందించడం సవాలుగా ఉండేదని, ప్రస్తుతం విద్యుత్, ఇంటర్నెట్తో పాటు అనేక డిజిటల్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్నాయని తెలిపారు. బ్యాంకింగ్ సేవలు కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా అందుబాటులో ఉన్నాయని వివరించారు మోడీ.. భారత్లో జరుగుతున్న డిజిటల్ విప్లవాన్ని ప్రస్తావిస్తూ, ఆధార్ ద్వారా కోట్లాది మంది ప్రజలకు డిజిటల్ గుర్తింపును కల్పించామని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 90 కోట్ల మంది భారతీయులకు డిజిటల్ హెల్త్ ఐడీలు అందుబాటులో ఉన్నాయని, దీనివల్ల వైద్య సేవలు మరింత సులభతరమయ్యాయని పేర్కొన్నారు.
యూపీఐ (UPI) వంటి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల నమూనా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. ప్రతి నెలా బిలియన్ల కొద్దీ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని, చిన్న వ్యాపారుల నుంచి వీధి వ్యాపారుల వరకు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారని చెప్పారు. సాంకేతికత కేవలం సౌకర్య సాధనం మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక సాధికారతకు కూడా శక్తివంతమైన సాధనంగా మారిందన్నారు ప్రధాని మోడీ..
భారత్-ఫ్రాన్స్ సంబంధాలపై మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య విశ్వాసం, ఆవిష్కరణ, ఉమ్మడి పురోగతి బలమైన పునాదులుగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, స్వచ్ఛ ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్ల వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత్-ఫ్రాన్స్ మధ్య వాణిజ్య సంబంధాలు వేగంగా విస్తరిస్తున్నాయని, భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం ప్రపంచానికి కొత్త అవకాశాలు, కొత్త పరిష్కారాలను అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ..

