పహల్గామ్ ఉగ్రదాడి.. భారతీయులు ఎప్పటికీ మరిచిపోలేని దుర్ఘటన. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసారన్ లోయలో పట్టపగలు ముగ్గురు ఉగ్రవాదులు నరమేదం సృష్టించారు. మతం పేరుతో 26 మంది పురుషులను పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన యావత్తు దేశంతో పాటు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది.
అయితే ఈ ఉగ్రదాడికి సంబంధించిఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక గైడ్లు ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం, సమాచారం అందించారని దర్యాప్తులో తేలింది. సకాలంలో స్థానికులు సమాచారం అందించి ఉంటే 26 మంది ప్రాణాలను కాపాడి ఉండేవారని ఛార్జిషీట్లో పేర్కొంది.
లోయలో పర్యాటకుల డబ్బుతో జీవనం సాగించే పర్వేజ్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు స్థానిక గైడ్లు 26 మంది ప్రాణాలను కాపాడి ఉండేవారని… అయినప్పటికీ వారి మౌనం, ఉగ్రవాదులకు అందించిన స్థానిక మద్దతు కాశ్మీర్ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడిగా మిగిలిపోయింది.
ఎన్ఐఏ ఛార్జ్ షీట్ ప్రకారం.. దాడికి ఒక రోజు ముందు.. అనగా ఏప్రిల్ 21, 2025న ఫైసల్ జాట్ అలియాస్ సులేమాన్, హబీబ్ తాహిర్ అలియాస్ చోటు, హమ్జా ఆఫ్ఘానీ అనే ముగ్గురు ఉగ్రవాదులు పహల్గామ్ ప్రాంతంలో సంచరిస్తున్నారు. ఆ క్రమంలోనే స్థానిక నివాసితులైన పర్వేజ్, బషీర్ను సంప్రదించి ఆశ్రయం కల్పించమని కోరారు.
ఎన్ఐఏకు ఇచ్చిన వాంగ్మూలంలో బషీర్ అహ్మద్… తాను ఆ ముగ్గురు ఉగ్రవాదులను చూశానని పేర్కొన్నాడు. తమను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లమని ఉగ్రవాదులు కోరారని.. ఆ తర్వాత వారిని ఒక చెట్టు కింద వేచి ఉండమని చెప్పి.. పర్వేజ్ గుడిసె లేదా ధోక్ దగ్గరకు వెళ్లి.. పర్వేజ్ భార్యను నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడు. సాయంత్రం సుమారు 5 గంటలకు బషీర్.. ఆ ముగ్గురు ఉగ్రవాదులను పర్వేజ్ గుడిసె దగ్గరకు రావాలని సంకేతం ఇచ్చాడు. ఆ ఉగ్రవాదులు ఆయుధాలు ధరించి ఉన్నారు. సంచులు ఆయుధాలతో నిండి ఉన్నాయి. వారు ఉర్దూలో మాట్లాడారు.. కానీ వారి యాస పంజాబీగా ఉంది. విచారణ సమయంలో వారి రూపాన్ని బట్టి వారిని ‘ముజాహిద్లు’ అంటే ఉగ్రవాదులుగా గుర్తించినట్లు బషీర్ అంగీకరించాడు.
తాము తీవ్రంగా అలసిపోయామని.. దాహంగా ఉన్నామని చెబుతూ.. ఉగ్రవాదులు అల్లాహ్ పేరు మీద సహాయం కోసం వేడుకున్నారు. అప్పుడు పర్వేజ్, బషీర్ వారికి నీరు, టీ, ఆహారం ఇచ్చారు. ముగ్గురు ఉగ్రవాదులు సుమారు ఐదు గంటల పాటు ఆ గుడిసెలోనే ఉన్నారని.. ఆ సమయంలో ఇద్దరు స్థానికులతో సుదీర్ఘంగా మాట్లాడుకున్నారని విచారణలో వెల్లడైంది.
ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర, పహల్గామ్లోని భద్రతా దళాల శిబిరాలు, బలగాల కదలికలు, ఆ ప్రాంతంలోని భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు. పర్వేజ్, బషీర్లు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే విషయం వారికి పూర్తిగా తెలుసని ఎన్ఐఏ పేర్కొంది.
ఇక రాత్రి సుమారు 10 గంటలకు ఉగ్రవాదులు గుడిసె నుంచి బయటకు వెళ్తున్నప్పుడు.. పర్వేజ్, బషీర్.. ఉగ్రవాదులకు 10 రొట్టెలు, కూరగాయలు ఇచ్చారు. వారు పసుపు, మిరపకాయలు, ఉప్పు, ఒక కుండ, ఒక గరిటె కూడా తీసుకున్నారు. ప్రతిఫలంగా ఉగ్రవాదులు పర్వేజ్కు 3,000 రూపాయలు ఇచ్చారని చార్జిషీట్లో పొందుపరిచారు.
దాడి జరిగిన రోజు.. అనగా ఏప్రిల్ 22న.. పర్వేజ్, బషీర్ బైసారన్ లోయ వెలుపల కంచెపై కూర్చున్న.. ముగ్గురు ఉగ్రవాదులను చూశారని దర్యాప్తులో వెల్లడైంది. ఆ రోజు పర్వేజ్, బషీర్.. ఇద్దరు పర్యాటకులతో కలిసి బైసారన్ లోయకు వెళ్లారు. పర్యాటకులతో కలిసి తిరిగి వస్తుండగా.. ఉగ్రవాదులను గుర్తించి అప్రమత్తమయ్యారు. కొద్దిసేపటికే పహల్గామ్కు చేరుకున్నప్పుడు.. పైన ఉన్న బైసారన్ లోయలో ఒక పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ఆ దాడి తర్వాత పర్వేజ్, బషీర్ నిశ్శబ్దంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎన్ఐఏ తన చార్జిషీట్లో వెల్లడించింది. ఒకవేళ పర్వేజ్, బషీర్ సకాలంలో స్పందించి ఉంటే 26 మంది ప్రాణాలను కాపాడిన వారిగా ఉండేవారు.
