Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!

  • పద్మ పురస్కారాలకు నామినేషన్లు ప్రారంభం
  • దరఖాస్తుకు జూలై 31 ఆఖరి తేదీ
Padma Awards Benefits

Padma Awards Benefits

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘పద్మ పురస్కారాలు – 2027’ కోసం నామినేషన్ల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించే ఈ అవార్డులను 2027 గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా ప్రకటించనున్నారు. ఈ అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫార్సులను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్’ (Rashtriya Puraskar Portal) ను ఉపయోగించుకోవాలి. నామినేషన్లు సమర్పించడానికి 2026, జూలై 31 వరకు గడువు ఉంది.

పురస్కారాల విభాగాలు ఇవే..
1954లో ప్రారంభమైన ఈ పద్మ పురస్కారాలు మూడు విభాగాలలో అందజేస్తారు. అసాధారణ, విశిష్ట సేవలకు పద్మ విభూషణ్ అవార్డు అందజేస్తారు. ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మ భూషణ్ అందజేస్తారు. ఏ రంగంలోనైనా విశిష్ట సేవలకు పద్మశ్రీ అందజేస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.

అర్హతలు, నియమాలు ..
భారతీయ పౌరులందరూ ఈ అవార్డులకు అర్హులే. ఎవరైనా తమను తాము నామినేట్ (Self-Nomination) చేసుకోవచ్చు లేదా ఇతరుల పేర్లను కూడా ప్రతిపాదించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు (డాక్టర్లు, శాస్త్రవేత్తలు మినహా), పీఎస్‌యూ (PSU) ఉద్యోగులు ఈ పురస్కారాలకు అనర్హులు. ఈ అవార్డులను నిజమైన ‘ప్రజల అవార్డులు’గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మహిళలు, అట్టడుగు వర్గాలు (SC, ST), దివ్యాంగులు, క్షేత్రస్థాయిలో నిస్వార్థ సేవ చేస్తున్న వారిని గుర్తించి నామినేట్ చేయాలని ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది.

దరఖాస్తు విధానం
ముందుగా awards.gov.in పోర్టల్‌ను సందర్శించాలి. తర్వాత ఆ పోర్టల్‌లో రిజిస్టర్ అయి, లాగిన్ ఐడిని సృష్టించుకోవాలి. అనంతరం ‘Padma Awards’ సెక్షన్‌లోకి వెళ్లి వ్యక్తి లేదా సంస్థ వివరాలను నింపాలి. నామినేట్ చేసిన వ్యక్తి సాధించిన విజయాలు, సేవలను వివరిస్తూ సుమారు 800 పదాలకు మించకుండా ఒక ‘ప్రశంసా పత్రాన్ని’ ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. తర్వాత అవసరమైన పత్రాలన్నీ జత చేసిన ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్న సామాన్యులను వెలుగులోకి తెచ్చేందుకు ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా కోరింది.