రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే వివిధ పార్టీల అధినేతలతో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసులో ఉన్న యశ్వంత్ సిన్హా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఎల్.కే.అడ్వాణీలకూ ఫోన్ చేశారు.
మరోవైపు ముర్ముకు మద్దతు ప్రకటించాలనే యోచనలో సోరెన్ ఉన్నట్టు తెలుస్తోంది. ముర్ము, సోరెన్ ఇద్దరూ సంతాల్ అనే ఒక గిరిజన తెగకు చెందిన వారు కావడం గమనార్హం. మరోవైపు జేడీఎస్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. సమాజ్ వాది పార్టీ మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా.. యశ్వంత్ సిన్హాకు జెడ్ కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్లోని వీఐపీ రక్షణ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. సిన్హా దేశవ్యాప్తంగా పర్యటించేటప్పుడు ఈ దళానికి చెందిన 8-10 మంది సాయుధ కమాండోలు విడతలవారీగా ఆయనకు రక్షణగా ఉండనున్నారు.
మరోవైపు.. తాను గిరిజన నేతనే అయినప్పటికీ గిరిజన వర్గాల అభ్యున్నతికి తాను చేసినంత కృషి అదే సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము చేయలేదని యశ్వంత్ సిన్హా కామెంట్ చేశారు. తనకు చాలా మంది మద్దతునిస్తున్నారని, క్రాస్ ఓటింగ్ జరిగి తానే రాష్ట్రపతిగా విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. 27న నామినేషన్ వేసిన తర్వాత ఆయన సొంత రాష్ట్రం బీహార్ నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ద్రౌపది ముర్ము పదవుల్లో వున్నప్పుడు గిరిజనులకు ఎలాంటి మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీయే ఓట్లను చీల్చి విజయం సాధిస్తానని యశ్వంత్ ధీమా వ్యక్తం చేశారు.
ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసే కంటే ముందు ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ముర్ము నామినేషన్ పత్రంలో ప్రధాని మోదీ, నడ్డాతో సహా పలువురు అగ్ర నేతలు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు చేశారు.
