వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ఆ చిన్నారికి వచ్చింది. ఈ వ్యాధి ట్రీట్మెంట్ కు ఒక ఇంజెక్షన్అవసరం. భారత్లో దొరకని ఆ ఇంజెక్షన్ ను అమెరికా నుంచి తెప్పించాలంటే 16 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ, చిన్నారి తల్లిదండ్రులకు అంతటి స్తోమత లేదు. అనుకొని విధంగా అదృష్టం వరించింది… ఇంజెక్షన్ ఉచితంగా పొంది పాపకు ఇంజెక్షన్ వేయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ.. చిన్నపిల్లల్లో కనిపించే ఓ జన్యు వాధి. జన్యువు లోపం వల్ల ఈ నాడీ సంబంధిత వ్యాధి వస్తుంది. మాటను, నడకను, ఆహారం మింగటాన్ని నియంత్రించే మెదడు కణాలను ఈ వ్యాధి క్రమక్రమంగా నశింపజేస్తుంది. కండరాలను బలహీన పరిచి పాలు తాగేందుకు, ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడేలా చేస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వారి వెన్ను వంగి ప్రాణం పోయే వరకు వస్తుంది. ఆ పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఒకే ఒక్క మందుంది. అదీ చిన్నప్పుడే వేయాలి. కానీ, దాని ధరే సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. 16 కోట్లు విలువ చేసే ఆ ఔషధం కోసం ఎంతో మంది అభాగ్యులు ఎదురుచూస్తూనే ఉండాల్సిన పరిస్థితి.
కానీ, తమళినాడులోని కోయంబత్తూరుకు చెందిన జైనబ్ అనే చిన్నారికి ఓనసెమ్నాజీన్ ఔషధం లాటరీలో దక్కింది. జైనబ్ కు ఎస్ఎంఏ ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులు అబ్దుల్లా, ఆయిషాకు ఇటీవలే తెలిసింది. జబ్బు చేసి ఆసుపత్రికి తీసుకెళ్తే టెస్టులు చేసి ఎస్ఎంఏ అని నిర్ధారించారు. అప్పటికే 2018లో అదే ఎస్ఎంఏతో మొదటి బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. తమ కూతురును ఎలాగైనా బతికించుకోవాలనుకున్నారు. పిల్లల ఎస్ఎంఏ చికిత్స కోసం పనిచేస్తున్న క్యూర్ ఎస్ఎంఏ అనే స్వచ్ఛంద సంస్థలో జైనబ్ పేరును నమోదు చేయించారు. అంతేకాదు.. ప్రధానికీ విజ్ఞప్తి చేశారు. వారు ప్రయత్నాలు చేస్తుండగానే అబ్దుల్లాకు ఫోన్ వచ్చింది. జైనబ్ కు లక్కీ డ్రాలో ఓనసెమ్నాజీన్ ఔషధం వచ్చిందని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చెప్పారు. దీంతో అబ్దుల్లా మొహం ఆనందంతో మెరిసిపోయింది. వెంటనే వెళ్లి అబ్దుల్లా ఆ ఔషధాన్ని తీసుకొచ్చేశాడు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో పాపకు ఇంజెక్షన్ ఇచ్చారు. లాటరీలో దక్కిన ఓనసెమ్నాజీన్ లక్కీ డ్రాలో జైనబ్ తో పాటు మరో ముగ్గురు చిన్నారులకూ ఔషధం అందజేశారు.