LPG New Rules: వంటగ్యాస్ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేసేందుకు జూన్ 1 నుంచి సరికొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. ‘ఒక కుటుంబానికి, ఒకే కనెక్షన్’ (One Nation, One Connection) నిబంధనను మరింత కఠినతరం చేస్తూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఎవరెవరి గ్యాస్ కనెక్షన్లు రద్దు అవుతాయి? రీఫిల్లింగ్ రూల్స్ ఎలా మారాయో పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పీఎన్జీ (PNG) ఉంటే ఎల్పీజీ (LPG) కట్
దేశంలో పైప్లైన్ గ్యాస్ (PNG) కనెక్షన్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, చాలామంది కుటుంబాలు పాత ఎల్పీజీ సిలిండర్లను వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇంట్లో పీఎన్జీ (PNG) కనెక్షన్ ఉన్నవారు తమ ఎల్పీజీ (LPG) కనెక్షన్ను వెంటనే వదులుకోవాల్సి వస్తుంది. ఒకే చిరునామాపై రెండు కనెక్షన్లు ఉండటం ఇకపై నిషిద్ధం. ఒకవేళ మీ ప్రాంతంలో పీఎన్జీ మౌలిక సదుపాయాలు ఉండి కూడా, మీరు నిర్దేశిత సమయంలోగా దానికి మారకపోతే.. మీ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది లేదా కనెక్షన్ రద్దవుతుందని తేల్చి చెప్పింది.
జూన్ 1 నుంచి పీఎన్జీ పైప్లైన్ పరిధిలోని ప్రాంతాల్లో ఉండే గృహాలకు గ్యాస్ సిలిండర్ల బుకింగ్ లేదా రీఫిలింగ్ను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీని కోసం ఓఎంసీలు (OMC), సిటీ గ్యాస్ నెట్వర్క్ డిజిటల్ డేటాబేస్లను అనుసంధానించారు. అయితే ఈ పీఎన్జీ కనెక్షన్ల పొడిగింపు గడువును జూన్ 30 వరకు పొడిగించారు. గ్యాస్ సిలిండర్ల కొరతను నింత్రించేందుకు – దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రీఫిల్లింగ్ లాక్-ఇన్ పీరియడ్ను కేంద్రం పెంచింది. పట్టణ వినియోగదారులకు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం గతంలో ఉన్న 21 రోజుల గడువును ఇప్పుడు 25 రోజులకు పెంచారు. ఈ లాక్-ఇన్ వ్యవధిని గ్రామీణ వినియోగదారులకు ఏకంగా 45 రోజులకు పెంచారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ తీసుకున్న 45 రోజుల తర్వాతే మరో సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కనెక్షన్ బదిలీకి బంపర్ ఆఫర్
పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజుల్లోపు తమ ఎల్పీజీ కనెక్షన్ను సరండర్ చేసిన వినియోగదారులకు ప్రభుత్వం ఒక గొప్ప ఊరటనిచ్చింది. వీరు భవిష్యత్తులో ఎప్పుడైనా పీఎన్జీ సౌకర్యం లేని వేరే ప్రాంతాలు లేదా నగరాలకు బదిలీ అయి వెళ్తే.. తమ పాత ఎల్పీజీ కనెక్షన్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి యాక్టివేట్ (పునరుద్ధరణ) చేసుకోవచ్చని చెప్పింది. ఎల్పీజీ వినియోగదారులకు యధావిధిగా ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే లభిస్తాయి. అంతకంటే ఎక్కువ కావాలంటే మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకునే వారికి సవరించిన డిపాజిట్ ధరలు, రెగ్యులేటర్, పైపు, ఇన్స్టాలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి.
ఈ నిర్ణయం ఎందుకంటే..
గత దశాబ్దంలో దేశంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య రెట్టింపు అయి 33.5 కోట్లకు చేరింది. కానీ పీఎన్జీ వినియోగదారులు కేవలం 164 లక్షలుగానే ఉంది. ఆసియా ఇంధన సంక్షోభం, సరఫరా కొరత దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
