కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. కరోనా భారిన పడి వేలమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా థాయిలాండ్లోని గబ్బిలాలలో మానవులకు సోకగల ఒక కొత్త కరోనావైరస్ను కనుగొన్నారు. టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన వైరస్ నిపుణుల బృందం ఈ ఆవిష్కరణ చేసింది. ఈ వైరస్, SARS-CoV-2 (COVID-19కి కారణమయ్యే వైరస్)ను పోలి ఉంటుంది. ఇది తక్షణమే మహమ్మారిగా మారదని నిపుణులు చెబుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఇది ఒక ముప్పుగా పరిణమించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కీ సాటో నేతృత్వంలోని బృందం, థాయ్లాండ్లోని చాచోయెంగ్సావో ప్రావిన్స్లో గుర్రపుడెక్క గబ్బిలాలలో ఈ కొత్త వైరస్ను కనుగొంది. ఈ వైరస్, SARS-CoV-2కు సంబంధించిన కరోనావైరస్ల కొత్త సమూహమైన క్లేడ్ బి అనే వర్గానికి చెందినది. పరిశోధకులు గబ్బిలాల నుండి నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలు నిర్వహించారు. ఈ అధ్యయనం మే 6, 2026న ప్రతిష్టాత్మకమైన ‘ సెల్’ పత్రికలో ప్రచురితమైంది.
ఈ వైరస్ జన్యువులు కోవిడ్-19 వైరస్ను చాలా పోలి ఉంటాయి. ఇది మానవ కణాలలోని ACE2 గ్రాహకానికి బంధించగలదని ప్రయోగాలలో తేలింది. అంటే దీనికి మనుషులలోకి ప్రవేశించే సామర్థ్యం ఉంది. అయితే, శుభవార్త ఏమిటంటే, ఈ వైరస్ నెమ్మదిగా వృద్ధి చెందుతుంది, జంతువులకు వ్యాపించలేదు.
ప్రొఫెసర్ కీ సాటో, అతని బృందం ప్రకారం, ఈ వైరస్ మానవులకు తక్షణ ముప్పును కలిగించదు. ఇప్పటికే ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్లు, మందులు ఈ కొత్త వైరస్పై ప్రభావవంతంగా పనిచేస్తాయని తేలింది. ప్రయోగశాల పరీక్షలలో ఈ వైరస్ బలహీనమైనదని వెల్లడైంది.
అయినప్పటికీ, గబ్బిలాలలోని వైరస్లు నిరంతరం రూపాంతరం చెందుతుండటంతో శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. చిన్న మార్పులు కూడా వాటిని మరింత అంటువ్యాధిగా, ప్రమాదకరంగా మార్చగలవు. ఈ వైరస్ యునాన్ (చైనా), ఉత్తర లావోస్ నుండి గబ్బిలాల నెట్వర్క్ల ద్వారా థాయ్లాండ్, చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ప్రవేశించి ఉండవచ్చు.
ప్రకృతిలో వేలాది వైరస్లు ఉన్నాయి. గబ్బిలాలు వైరస్లకు ఒక ముఖ్యమైన స్టోరేజ్ కేంద్రం. ఆసియాలోని గబ్బిలాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ఈ కొత్త వైరస్ ఇప్పటివరకు ఏ మనిషి కూడా సోకినట్లు నివేదికలు లేవు. అయినప్పటికీ, ఆరోగ్య అధికారులు నిరంతర అప్రమత్తతను పాటించాలని సూచిస్తున్నారు. గబ్బిలాలను సందర్శించేవారు లేదా వాటి రెట్టలు ఉన్న ప్రాంతాలకు వెళ్లేవారు ఎవరైనా జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.
