Massive Fire Erupts At Sugar Mill In Uttar Pradesh Meerut: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈరోజు (26-11-22) మధ్యాహ్నం మొహియుద్దీన్పూర్ చక్కెర మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నరేంద్ర కుష్వాహా అనే ఒక ఇంజినీర్ మృతి చెందాడు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిల్లు నుంచి పెద్దఎత్తున పొగలు రావడంతో.. ఉద్యోగులు ఒక్కసారిగా సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు.
ఈ ఘటన గురించి మిల్లు జనరల్ మేనేజర్ శీష్పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో ఒక టర్బైన్ ఒక్కసారిగా ట్రిప్ అయ్యిందన్నారు. దాన్ని పరిశీలించడానికి తాము వెళ్లగా.. ఇంతలో దట్టమైన పొగలు ఫ్యాక్టరీని చుట్టుముట్టడం ప్రారంభించాయన్నారు. అప్పుడు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి.. వెంటనే బయటకు పరుగులు తీశారని పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనలో తమ ఇంజినీర్లలో ఒకరు తీవ్రంగా గాయపడిన కారణంగా, అతడ్ని ఆసుపత్రికి తరలించామన్నారు. కానీ, పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ మరణించాడన్నారు.
ఇక ఈ ఘటనపై ఫైర్ ఆఫీసర్ ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. తమకు ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి మధ్యా్హ్నం 3 గంటలకు సమాచారం అందిందని, వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. ఇదో భారీ అగ్ని ప్రమాదం కావడంతో తాము తొలుత పత్తాపూర్ నుంచి రెండు, ఆ తర్వాత పోలీస్ లైన్ నుంచి మరో నాలుగు ఫైర్ టెండర్స్ని పిలిచామన్నారు. మంటలను ఆర్పేందుకు మొత్తంగా ఏడు ఫైర్ టెండర్లు సేవలో ఉన్నాయన్నారు. మంటలు ఆర్పేశాక.. ఎంత నష్టం జరిగింది, ఈ ఘటనకు గల కారణాలేంటో తెలుసుకుంటామని పేర్కొన్నారు.
