CBI Raids On Delhi Deputy Chief Minister manish sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు నమోదు అయ్యాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. దీంట్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఏ1 నిందితుడిగా చేర్చింది. తొమ్మిది నెలల క్రితం అమలు చేయబడి.. గత నెల వరకు అమలులో ఉన్న ఢిల్లీ కొత్త మద్యం పాలసీలో చాలా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. మనీష్ సిసోడియాతో పాటు ఢిల్లీ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపి కృష్ణ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీబీఐ.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. మనీష్ సిసోడియా నివాసంతో పాటు ఢిల్లీలో 21 చోట్ల ఏడు రాష్ట్రాలు/యూటీల్లో 10 చోట్ల మొత్తంగా 31 చోట్ల సీబీఐ దాడులు చేస్తోంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అనే లిక్కర్ వ్యాపారి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఇండో స్పిరిట్ పేరులో బెంగళూర్ కేంద్రంగా ఆయన లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏ14గా ఈయన పేరును చేర్చారు. అరుణ్ రాంచంద్ర పిళ్లై నుంచి రూ.2.5కోట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎంకు ఇచ్చినట్లు సీబీఐకి సమాచారం ఉంది. టెండర్ దక్కించుకునేందుకు ఈ డబ్బును ముట్టచెప్పినట్లు సమాచారం. హైదరాబాద్, బెంగళూర్ లో ఉన్న రామచంద్ర పిళ్లై ఇంట్లో, కార్యాలయాల్లో కూడా సీబీఐ సోదాలు చేస్తోంది.
Read Also: Chopper Makes Emergency Landing: సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. మధ్యం దుకాణాల టెండర్లు దక్కించుకునే సమయంలో క్విడ్ ప్రోకో జరిగిందని సీబీఐ అధికారులు వెల్లడిస్తున్నారు. మద్యం దుకాణాల స్కామ్ లో పలు కీలక పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఎవరికి ఎంత ముట్టచెప్పారనే కోణంలో సీబీఐ విచారణ చేస్తోంది. సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వమే సిసోడియాపై దాడులు చేస్తోందని ఆప్ తో పాటు సమాజ్ వాాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు.