CJP: కాక్రోచ్‌ల సంబరాలకు డబ్బు ఎక్కడిది.? మహేష్ జెఠ్మలానీ అనుమానాలు..

  • సీజేపీ సంబరాల వీడియోను షేర్ చేసిన మహేష్ జెఠ్మలానీ.
  • ఉద్యమానికి నిధులు ఎవరు సమకూర్చారో వెల్లడించాలని డిమాండ్.
  • ప్రయాణం, వసతి, లాజిస్టిక్స్ ఖర్చులపై ప్రశ్నలు.
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ విజయోత్సవాలు.

CJP:  నీట్ పేపర్ లీక్ వివాదంలో విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేసుకున్న సంబరాలు, పార్టీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక స్టార్ హోటల్‌లో సీజేపీ పార్టీ తన మద్దతుదారులకు పార్టీ ఇచ్చినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ ఈ పార్టీపై అనేక అనుమానాలు లేవనెత్తారు. ఢిల్లీలో రోజుల తరబడి జరిగిన హింసాకాండ తర్వాత, ఈ యువ నేతలుగా చెప్పుకునే వారు మ్యూజిక్ పెట్టుకుని, డ్యాన్స్ చేయడం ప్రారంభించారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఈ మొత్తం నిరసనలకు సంబంధించి వారి ప్రయాణం, ఆహారం, వసతి, మైక్-స్పీకర్ వంటి పరికరాలు, లాజిస్టిక్స్‌కు ఎవరు నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. ఢిల్లీలో అల్లకల్లోలం చేసిన వ్యక్తులకు నిధులు ఎక్కడివని అడిగారు. ఇదిలా ఉంటే, జంతర్ మంతర్ వద్ద నిరసన జరుగుతున్నంత కాలం నిరసనకారులకు మూడు పూటల ఆహారం అందించిన జునైద్ అనే వ్యక్తిని యూపీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సాధారణ వ్యాపారం చేసుకునే వ్యక్తికి ఇలా ఫుడ్ ఆర్గనైజ్ చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నారు.