Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?

  • 1948 జనవరిలో మహాత్మా గాంధీ తన చివరి నిరాహార దీక్ష..
  • విభజన అనంతర మత హింసను ఆపడం ఆయన ప్రధాన లక్ష్యం.
  • భారత్‌లో ముస్లింలు, పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కుల భద్రత కోసం దీక్ష.
  • పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లను ఇవ్వాలని కోరిన గాంధీ..
  • గాంధీ దీక్షపై హిందూ, సిక్కు శరణార్థుల్లో వ్యతిరేకత..
Gandhi

Gandhi

Mahatma Gandhi: మహాత్మా గాందీ తన జీవితంలో చివరిసారిగా 1948 జనవరిలో చివరి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష వెనక భారత్, పాకిస్తాన్‌కు చెల్లించాల్సిన రూ. 55 కోట్లు అంశం ఉంది. అప్పటికే విభజన గాయాలతో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొని ఉండటం, మరోవైపు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌ను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న కాలంలో గాంధీ పాకిస్తాన్ కోసం నిరాహార దీక్షకు కూర్చున్నారు.

అయితే, మత విద్వేశాలు దేశాన్ని చీల్చివేయకుండా అడ్డుకోవడం, భారత్‌లో ముస్లింల హక్కులు, భద్రతకు హామీ కల్పించడం, పాకిస్తాన్‌లో హిందువుల, సిక్కుల భద్రత కోసం శాంతిని నెలకొల్పడం ఆయన ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. అయితే, ఉద్దేశాలు సరైనవే అయినా అప్పుడున్న పరిస్థితులు దీనికి మద్దతుగా లేవు. ఇదే చాలా మంది శరణార్థి హిందువులు, సిక్కుల్లో గాంధీ పట్ల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. గాంధీ తన దృష్టిలో పాకిస్తాన్‌కు చెల్లించాల్సిన డబ్బును నైతిక బాధ్యత గా భావించారు. పాకిస్తాన్‌కు డబ్బు నిలిపేసి అదే సమయంలో వారి నుంచి న్యాయం, శాంతిని ఆశించడం సరైంది కాదని గాంధీ భావించారు.

చివరి నిరాహార దీక్ష:

1947 విభజన మత విద్వేషాలకు కారణమైంది. పాకిస్తాన్ హిందువుల, సిక్కుల్ని ఊచకోత కోసింది. అదే సమయంలో బెంగాల్ వ్యాప్తంగా మత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కలకత్తాలో హిందువులపై దారుణ మారణకాండ జరిగింది. విభజన వల్ల రెండు దేశాల్లో తీవ్ర హింస, వలసలు, అశాంతి చెలరేగింది. గాంధీ ముందుగా బెంగాల్, తర్వాత ఢిల్లీలో మత హింసను తగ్గించే ప్రయత్నం చేశారు. మతం ఆధారంగా ఒక వ్యక్తి హక్కులు నిర్ణయించబడని భారతదేశాన్ని ఆయన కోరుకున్నారు. 1948 జనవరి 13న న్యూఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ తన చివరి నిరాహార దీక్షను ప్రారంభించారు. మతాల మధ్య సామరస్యం ఏర్పడే వరకు ఆహారం తీసుకోబోనని గాంధీ ప్రకటించారు.

వివాదంగా రూ. 55 కోట్లు:

బ్రిటిష్ ఇండియా ఆస్తుల విభజనలో భాగంగా పాకిస్తాన్‌కు భారత్ నుంచి మొత్తం రూ. 75 కోట్లు వెళ్లాల్సి ఉంది. అందులో అప్పటికే రూ. 20 కోట్లు చెల్లించగా మిగిలిన రూ.55 కోట్లు పెండింగ్‌లో ఉంచారు. అప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాశ్మీర్‌లో యుద్ధం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య శత్రుత్వంగా మారిన సమయంలో ఈ డబ్బులు ఇవ్వడం సరైంది కాదని భారత్ భావించింది.

గాంధీ దీక్షపై తీవ్ర వ్యతిరేకత..

గాంధీ వైఖరిపై చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. విభజన సమయంలో పాకిస్తాన్ హింసను ఎదుర్కొని భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు శరణార్థులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లిం ప్రయోజనాలకు గాంధీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని భావించారు. బిర్లా హౌజ్ ముందు శరణార్థులు నిరసన కూడా తెలిపారు.

7 షరతులతో దీక్ష విరమణ..

జనవరి 17న గాంధీ తన దీక్ష విరమణకు 7 షరతులను ముందు పెట్టారు. ఢిల్లీలో ఆక్రమించిన మసీదులను ముస్లింలకు అప్పగించడం, ముస్లింలు స్వేచ్చగా తిరగడానిరి, వారి ఇళ్లకు వెళ్లడానికి అవకాశం కల్పించడం, ఆర్థిక బహిష్కరణ నుంచి రక్షణ కల్పించడం వంటి అంశాలు అందులో ఉన్నాయి. మత సామరస్యం, ఢిల్లీలో ముస్లింల భద్రత ఆయన దీక్షకు కేంద్రంగా ఉంది.

దాదాపుగా 2 లక్షల మంది శాంతియుతంగా ఉంటామని ప్రతిజ్ఞపై సంతకాలు చేశారు. ముస్లింలు కూడా ఇతరుల మాదిరిగానే ఢిల్లీలో శాంతి, భద్రత, ఆత్మగౌరవంతో జీవించే హక్కు కలిగి ఉండాలని వారు అంగీకరించారు. జనవరి 18న హిందూ, ముస్లిం, సిక్కు నాయకులు గాంధీ షరతులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గాంధీ నిమ్మరసం తీసుకుని తన నిరాహార దీక్షను విరమించారు. చివరకు రూ. 55 కోట్ల అంశం వివాద అంశంగా మిగిలిపోయింది.