NTV Telugu Site icon

Maharashtra: ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కొత్త స్కీమ్ ప్రకటన.. డిగ్రీ పాసైతే నెలకు రూ.10వేలు సాయం

Maharashtragovernment

Maharashtragovernment

మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత కోసం ఓ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి యువజన పని శిక్షణ పథకం పేరుతో నిరుద్యోగ యువతకు వారి విద్యార్హతలను బట్టి నెల నెలా బ్యాంకు అకౌంట్లలో స్టయిఫండ్‌ను జమ చేయనున్నారు. ఇందుకోసం రూ.5,500 కోట్లు కేటాయించింది. అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఏక్‌నాథ్‌ షిండే సర్కారు ఈ స్కీమ్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది.

18-35 ఏళ్లు వయసు గల మహారాష్ట్ర నివాసితులు ఈ పథకానికి అర్హులు. కనీసం 12 తరగతి పాసై పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఈ పథకం కింద లబ్ధి పొందొచ్చు. ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పొందడంతో పాటు పరిశ్రమ అవసరాలకు యువతను సిద్ధం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. 12వ తరగతి పాసైన వారికి నెలకు రూ.6వేలు, ఐటీఐ/ డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.8 వేలు, డిగ్రీ/పీజీ పూర్తి చేసిన వారికి రూ.10 వేలు చొప్పున స్టయిఫండ్‌ చెల్లించనున్నారు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పండర్‌పూర్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల కోసం లాడ్లీ బెహన్ పథకాన్ని ప్రారంభించారని.. సోదరుల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తు్న్నారని.. అందుకోసమే యువత కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో అక్టోబర్‌- నవంబర్‌ మధ్య ఎన్నికలు జరగనున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్‌ నేతృత్వంలోని శివసేన, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ ఒక కూటమిగా బరిలోకి దిగనున్నాయి.

ఇదిలా ఉంటే ముంబైలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున తరలిరావడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. 2 వేలకు పైగా పోస్టుల కోసం జ‌రిగిన వాకిన్‌కు దాదాపు 25 వేల మందికి పైగా నిరుద్యోగులు తరలివచ్చారు.. దీంతో ఎయిర్‌పోర్టు వ‌ద్ద ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. యువకుల మధ్య తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది.. 2,216 ఖాళీల కోసం 25,000 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు వచ్చారు.. వారాన్ని నియంత్రించడం ఎయిర్ ఇండియా సిబ్బందికి కష్టంగా మారిపోయింది.. ఫారమ్ కౌంటర్‌లను చేరుకోవడానికి దరఖాస్తుదారులు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు.. అంతేకాదు.. దరఖాస్తుదారులు.. ఆహారం.. మంచినీళ్లు కూడా లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.