పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్ను వదిలించుకునేందుకు సియా గోయల్ తన ప్రియుడితో కలిసి చాలా పన్నాగాలు పన్నినట్లుగా తెలుస్తున్నాయి. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీసుల విచారణలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ.. కేతన్ హత్యకు చాలా నెలల ముందే పక్కా ప్రణాళికతో కుట్ర పన్నినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు.
విచారణలో చేతన్ చౌదరి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తాను సియాతో కలిసి పారిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నానని చెప్పాడు. అయితే సియా మాత్రం తన కుటుంబం చాలా పలుకుబడి కలిగినదని, వారి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని.. కేతన్ను హత్య చేయడమే ఒక్కటే మార్గమని పట్టుబట్టినట్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వాదనను సియా గోయల్ ఖండించింది. కేతన్ హత్యకు సంబంధించిన మొత్తం ప్రణాళిక చేతన్దేనని.. జూన్ 14న జరిగిన తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత చేతన్ తీవ్ర నిరాశకు గురై తన ఎదుటే ఏడ్చాడని విచారణలో తెలిపినట్లు సమాచారం.
పోలీసుల సమాచారం ప్రకారం.. కేతన్ను లోహగడ్ కోట దగ్గర హత్య చేయడానికి సియా, చేతన్ రెండు సార్లు ముందే అక్కడికి వెళ్లారు. అయితే కేతన్ను లోయలోకి తోసేందుకు సియా ధైర్యం చేయలేకపోవడంతో ఆ రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెండోసారి కూడా ప్రణాళిక అమలు కాకపోవడంతో సియాతో చేతన్.. “నువ్వు చేయలేవు… ఇక నేను చూసుకుంటా” అని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం మూడోసారి లోహగడ్ కోటకు వెళ్లిన సమయంలో కేతన్ను సుమారు 600 అడుగుల లోతైన లోయలోకి తోసివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ‘‘దీన్ని నేను చూసుకుంటాను’’ అని కేతన్తో చేతన్ అన్నట్లుగా తెలుస్తోంది.
ఇక హత్య ప్రణాళికను వీలైనంత త్వరగా అమలు చేసి.. అనంతరం సియాతో కలిసి మహాబలేశ్వర్లో గడపాలని చేతన్ భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కేతన్ను హత్య చేసే సమయంలో ముందుగానే ఒక రహస్య సంకేతాన్ని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోట అంచు దగ్గర సియా కిందకు వంగిన వెంటనే.. అదే సంకేతంగా భావించి చేతన్.. కేతన్ను లోయలోకి తోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అలాగే హత్యకు ముందు నిందితులు పలుమార్లు లోహగడ్ కోటకు వెళ్లి ప్రాంతాన్ని పరిశీలించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే హత్యకు కొన్ని నెలల ముందు కేతన్ పాస్పోర్టు అదృశ్యమైన ఘటనపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ కారణంగా కేతన్, సియా కలిసి వెళ్లాల్సిన బాలి పర్యటన రద్దయినట్లు పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉండగా చేతన్ చౌదరి కుటుంబ సభ్యులు మాత్రం అన్ని ఆరోపణలను ఖండిస్తున్నారు. తన కుమారుడు నిర్దోషి అని చేతన్ తండ్రి బాబూలాల్ చౌదరి తెలిపారు. ఘటన సమయంలో చేతన్ కొంత దూరంలో నిలబడి ఉండగా.. కేతన్కు అత్యంత సమీపంలో సియానే ఉందని ఆయన పేర్కొన్నారు. చేతన్ను ఈ కేసులో తప్పుడు ఆరోపణలతో ఇరికించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి న్యాయస్థాన కస్టడీలో ఉండగా.. ఈ హత్యకు సంబంధించిన పూర్తి కుట్ర, ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

