Karnataka: రామనగర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం.. కొత్త పేరు ఇదే!

  • కర్ణాటకలోని రామనగర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం
  • త్వరలో కొత్త పేరును ఆమోదించనున్న కేబినెట్
Karnataka

Karnataka

కర్ణాటకలోని రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామనగర్
జిల్లా  బెంగళూరు నుంచి 50 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ జిల్లాలో రామనగర, మాగడి, కనకపుర, చన్నపట్న మరియు హారోహళ్లి తాలూకాలు ఉన్నాయి.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్… ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మెమోరాండం సమర్పించడంతో జిల్లా పేరు మార్చాలనే ప్రతిపాదన ఊపందుకుంది. శివకుమార్ రామనగర ఇన్‌చార్జి మంత్రిగా.. బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కూడా ఉన్నారు. అంతేకాదు శివకుమార్ సొంత జిల్లా రామనగర కావడం విశేషం. గత ఏడాది అక్టోబరులో ఆయన తొలిసారిగా పేరు మార్చాలని ప్రతిపాదించారు.

×
×
Ad

రామనగర జిల్లాకు చెందిన నాయకులు డీకే శివకుమార్ నేతృత్వంలో తనను కలిశారని సిద్ధరామయ్య తెలిపారు. మొదటి నుంచి ఈ ప్రాంత ప్రజలు తమను బెంగళూరులో భాగంగా చేయాలని భావించారని.. అందుకే జిల్లాకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలో కేబినెట్‌ సమావేశంలో ఆమోదిస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

ఇదిలా ఉంటే రామనగరలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఉపయోగించుకునేందుకే ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. మళ్లీ ముఖ్యమంత్రి కాగానే ఈ నిర్ణయాన్ని మారుస్తామని వెల్లడించారు. 2007 ఆగస్ట్‌లో రామనగర జిల్లాను విభజించినప్పుడు కుమారస్వామి జేడీయూ, బీజేపీ సంకీర్ణానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. వారు అధికారంలోకి రావడం భ్రమ అన్నారు.