Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..

  • కేతన్ అగర్వాల్ హత్య కేసుపై కంగనా రనౌత్ స్పందించారు
  • సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు
  • పిల్లల తప్పులకు తల్లిదండ్రులను పూర్తిగా బాధ్యులను చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు
Kangana Ranaut

Kangana Ranaut

లోనావాలాలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసుపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ తండ్రి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ, పిల్లల తప్పులకు తల్లిదండ్రులను పూర్తిగా బాధ్యులను చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “నా కుమార్తె దోషిగా తేలితే ఆమెపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి” అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కంగనా రనౌత్, నేటి కాలంలో పిల్లల వ్యక్తిత్వాన్ని కేవలం కుటుంబం ఆధారంగా అంచనా వేయలేమని పేర్కొన్నారు.

సోషల్ మీడియా, AI ప్రభావం ఎక్కువ

కంగనా తన పోస్టులో.. “ఈ రోజుల్లో పిల్లల సంస్కారం గురించి కేవలం వారి కుటుంబాన్ని చూసి చెప్పలేం. వారు ఎవరితో సమయం గడుపుతున్నారు, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బయట వాతావరణం వారి ఆలోచనలపై ఎలా ప్రభావం చూపుతున్నాయన్నది కూడా ముఖ్యమే.” ఆమె అభిప్రాయం ప్రకారం, నేటి యువతపై డిజిటల్ వరల్డ్ ఎఫెక్ట్ గణనీయంగా పెరిగిందని, అందువల్ల ప్రతి చర్యకు తల్లిదండ్రులను బాధ్యులను చేయడం సరైన విధానం కాదని చెప్పారు.

తల్లిదండ్రులను నిందించడం సరికాదు

కంగనా మరో పోస్టులో ప్రజలు ఒకే సమయంలో అనేక రకాల జీవితాలను గడుపుతున్నారని, సోషల్ మీడియాలో ఒక రూపం, వాస్తవ జీవితంలో మరో రూపం ఉండే పరిస్థితులు పెరిగాయని పేర్కొన్నారు. దీంతో పిల్లలు తీసుకునే ప్రతి నిర్ణయానికి లేదా వారి చర్యలకు కుటుంబ సభ్యులనే పూర్తిగా బాధ్యులను చేయడం న్యాయసమ్మతం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

అసలు ఏం జరిగింది?

జూన్ 18న మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట వద్ద వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించినప్పటికీ, దర్యాప్తులో ఇది హత్య కేసుగా మారింది. ఈ కేసులో కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమెతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేతన్ చౌదరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సేకరించిన డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, లొకేషన్ వివరాల ఆధారంగా ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన నేరమని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సియా తల్లిదండ్రుల సంచలన వ్యాఖ్యలు

ఈ కేసుపై స్పందించిన సియా గోయల్ తల్లిదండ్రులు, చట్టం తన పని చేయాలని కోరారు. తమ కుమార్తె దోషిగా తేలితే ఆమెపై కూడా అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ మాట్లాడుతూ, కేతన్‌ను తాము సొంత కుమారుడిలా భావించామని, తన కుమార్తె పెళ్లిపై ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు.

దర్యాప్తు కొనసాగుతోంది

ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు, చేతన్ చౌదరి కుటుంబం మాత్రం తమ కుమారుడికి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని చెబుతూ ఆరోపణలను ఖండించింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యాకే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.