Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల

  • కమల్‌హాసన్ సంచలన నిర్ణయం
  • మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
  • భారతీయులంతా సహకరించాలని వినతి
Kamalhaasan

Kamalhaasan

ప్రపంచ సంక్షోభం వేళ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి రాజ్యసభ ఎంపీ, మక్కల్ నీధి మయ్యం (MNM) అధినేత కమల్‌ హాసన్ మద్దతు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపునకు కమల్ హాసన్ మద్దతుగా నిలిచారు.. దేశ ప్రయోజనాలు రాజకీయాల కంటే ముందుండాలని స్పష్టం చేశారు.

ఎక్స్‌లో వీడియో సందేశం విడుదల చేసిన కమల్ హాసన్.. భారత్ గతంలో యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, కొరత పరిస్థితులను ఐక్యంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం ఇంధన ధరలు, సామాన్య ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. “నా ప్రియమైన భారతీయులారా.. ఇరాన్ యుద్ధ ప్రభావంపై తీవ్ర ఆందోళనతో ఓ భారతీయుడిగా మీతో మాట్లాడుతున్నాను” అని కమల్ హాసన్ అన్నారు.

ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. “60కి పైగా దేశాలు ఇప్పటికే ఇంధన పొదుపు నిబంధనలు అమలు చేస్తున్నాయి. సింగపూర్ ప్రధాని కూడా తమ ప్రజలను కష్టకాలానికి సిద్ధంగా ఉండమని కోరారు. మన దేశం ఇంకా పెద్దది. వచ్చే ఏడాది పాటు ఇంధనాన్ని పొదుపు చేయాలని మన ప్రధాని పిలుపునిచ్చారు” అని తెలిపారు. ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనబెట్టి దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సూచించారు. “అటల్ బిహారీ వాజపేయి చెప్పినట్లుగా ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ దేశం శాశ్వతం. కాబట్టి దేశ బాధ్యత రాజకీయాల కంటే పైగా ఉండాలి” అని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా కమల్ ప్రశంసించారు. “నేను ఒక సెంట్రిస్ట్‌గా రాజకీయ అనుబంధాలకు అతీతంగా మంచి పనిని అభినందించాలి. గత దశాబ్దంలో భారతదేశంలో సౌర, వాయు విద్యుత్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. బొగ్గు గ్యాసిఫికేషన్, పునరుత్పాదక, అణు ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెరగడం ప్రోత్సాహకరం. విదేశీ చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇవి కీలక చర్యలు” అని అన్నారు.

అయితే పెరుగుతున్న ఇంధన ధరల భారం మొత్తం ప్రజలపైనే పడకూడదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. “పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించాలి. అలాగే రైళ్లు, మెట్రో, బస్సుల ఛార్జీలను కూడా తగ్గిస్తే ప్రజలు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తారు” అని పేర్కొన్నారు.

ప్రపంచ భౌగోళిక రాజకీయాల ప్రభావం సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు అందరిపై పడుతుందని హెచ్చరించారు. “ఈ సంక్షోభాన్ని మనమంతా కలిసి ఎదుర్కొంటే భారత్ మరింత బలంగా ఎదుగుతుంది” అని కమల్ హాసన్ అన్నారు. ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు, దేశీయ ద్రవ్యోల్బణంపై భారత్ ఆందోళన చెందుతున్న సమయంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.