Gang R*ape Case: వివాహితకు బలవంతంగా మద్యం తాగించి.. ఆపై తుపాకీ చూపించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది.. కళ్యాణ్-భివండి ప్రాంతంలో 22 ఏళ్ల వివాహిత చేసిన ఫిర్యాదు ఆధారంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్, బర్తరఫ్ అయిన పోలీస్ ఉద్యోగి శైలేష్ పాటిల్పై పద్ఘా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన కుటుంబ సమస్యలు.. అంటే.. తన భర్తతో ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు సాయం చేస్తామని నమ్మించి.. తనను ఫామ్హౌస్కు తీసుకెళ్లారని.. అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. భర్తతో వివాదం నేపథ్యంలో సహాయం కోరేందుకు ఆమె నరేంద్ర పవార్ను సంప్రదించింది. సెప్టెంబర్ 13న సమస్యను పరిష్కరిస్తానని చెప్పి పవార్.. ఆమెను కళ్యాణ్లోని తన కార్యాలయానికి పిలిచారని ఆమె ఆరోపించింది. అక్కడి నుంచి పవార్, శైలేష్ పాటిల్ కలిసి ఆమెను భివండి తాలూకాలోని బాప్గావ్లో ఉన్న ఫామ్హౌస్కు తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొంది.
ఇక, ఫామ్హౌస్లో శైలేష్ పాటిల్ తనను ఆయుధంతో బెదిరించి బలవంతంగా మద్యం తాగించాడని ఆరోపించింది బాధిత మహిళ.. ఆ తర్వాత నరేంద్ర పవార్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత పవార్ అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం శైలేష్ పాటిల్ కూడా తనపై లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో తెలిపింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో పాటిల్కు చెందిన కేర్టేకర్ తనను ఇంటి వద్ద దింపినట్లు ఆమె వెల్లడించింది. ఈ ఘటన తర్వాత భయాందోళనకు గురైన మహిళ సెప్టెంబర్ 16న కళ్యాణ్-డొంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కంచన్ కులకర్ణిని సంప్రదించింది. తన వద్ద ఉన్న వీడియోలు, మొబైల్ వాట్సాప్ చాట్లను ఆమెకు చూపించినట్లు సమాచారం. అనంతరం కులకర్ణి బాధితురాలిని వెంట తీసుకుని అదే రాత్రి పద్ఘా పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
మహారాష్ట్ర డీజీపీ సదానంద్ డేట్ను సంప్రదించిన అనంతరం పోలీసులకు కేసు నమోదు చేయాలని సూచనలు వచ్చినట్లు కంచన్ కులకర్ణి తెలిపారు. అనంతరం పద్ఘా పోలీస్ స్టేషన్ పోలీసులు ఫిర్యాదును పరిశీలించి నరేంద్ర పవార్, శైలేష్ పాటిల్పై సామూహిక అత్యాచారం, ఆయుధంతో బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కంచన్ కులకర్ణి డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా అరెస్టులు జరగకపోతే పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి పద్ఘా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపడతామని ఆమె హెచ్చరించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫిర్యాదులో చేసిన ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. నిందితులపై నమోదైన కేసు తుది నేర నిర్ధారణగా పరిగణించరాదు.

