Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..

Kailash Mansarovar Yatra 19

Kailash Mansarovar Yatra 19

Kailash Mansarovar Yatra 1981: టిబెట్-నేపాల్‌ వరదలు.. నేపాల్‌లో ఊహించని భారీ నష్టాన్నే మిగిల్చాయి.. ఎంతమంది ప్రాణాలు విడిచారో ఇప్పటికీ సరైన లెక్కచెప్పడం కూడా కష్టంగానే ఉంది.. బురదలో, శిథిలాల కింది.. కాదేది శవాలు ఉండే చోటుకు అనే విధంగా.. ఎక్కడ చూసినా మృతదేహాలే దర్శనమిస్తున్నాయి.. దీంతో, కైలాస మానస సరోవరం యాత్ర మరోసారి తెరపైకి వచ్చింది.. కైలాస మానస సరోవరం.. హిందువులు, బౌద్ధుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. టిబెట్‌లో దాదాపు 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న కైలాస పర్వతం ప్రకృతి అందాలతో పాటు మతపరమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే చైనా టిబెట్‌ను ఆక్రమించిన తర్వాత భారతీయులకు కైలాస మానస సరోవర్ యాత్రకు దాదాపు మూడు దశాబ్దాల పాటు అవరోధాలు ఏర్పడ్డాయి. 1981లో ఈ యాత్ర తిరిగి ప్రారంభం కావడం వెనుక అప్పటి జనతా పార్టీ ఎంపీ, ఇప్పటి బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కీలక పాత్ర పోషించినట్లు ఆయన స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు.

కైలాస పర్వతం.. ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక
టిబెట్‌లో ఉన్న కైలాస పర్వతం సుమారు 22 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎవరెస్ట్ కంటే ఎత్తు తక్కువైనా.. మతపరమైన ప్రాధాన్యత విషయంలో కైలాసానికి ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు దిక్కుల నుంచి దాదాపు పిరమిడ్ ఆకారంలో కనిపించే ఈ పర్వతాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తారు. బౌద్ధులకు కూడా ఇది అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. టిబెటన్లు కైలాసాన్ని ‘ఖాంగ్ రిన్‌పోచే’ అని పిలుస్తారు. దీని అర్థం ‘మంచు యొక్క అమూల్యమైన రత్నం’ అని చెబుతారు. కైలాసానికి సమీపంలో మానస సరోవరం, రాక్షస తాల్ అనే రెండు ప్రసిద్ధ సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం మంచినీటి సరస్సు కాగా, రాక్షస తాల్ ఉప్పునీటి సరస్సుగా ఉంది. రెండూ ఒకదానికొకటి సమీపంలో ఉన్నప్పటికీ వాటి నీరు కలవకపోవడం ప్రత్యేకతగా చెప్పబడుతుంది.

మానస సరోవరం నుంచి కైలాసానికి ఎంత దూరం?
మానస సరోవరం, కైలాస పర్వతం మధ్య దూరం సుమారు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. రహదారి మార్గంలో ఈ దూరం దాదాపు 30-35 కిలోమీటర్లుగా ఉంటుంది. కైలాస పర్వతం మానస సరోవరానికి ఉత్తర దిశలో ఉంది. యాత్రికులు సాధారణంగా ముందుగా మానస సరోవరాన్ని సందర్శించి, అక్కడ స్నానం, దర్శనం అనంతరం దార్చెన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కైలాస ప్రదక్షిణను ప్రారంభిస్తారు.

చైనా టిబెట్ ఆక్రమణతో మారిన పరిస్థితులు
ప్రాచీన కాలం నుంచి భారతీయ సాధువులు, భక్తులు వివిధ హిమాలయ కనుమల గుండా కాలినడకన కైలాస మానస సరోవర యాత్ర చేసేవారు. ముఖ్యంగా లిపులేఖ్, నాథూ లా వంటి మార్గాలు యాత్రకు ఉపయోగించేవారు. అయితే 1950-51లో చైనా టిబెట్‌ను ఆక్రమించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కైలాస మానస సరోవర్ యాత్రపై ఆంక్షలు విధించబడ్డాయి. కొన్ని నివేదికల ప్రకారం 1935 నుంచే యాత్ర నిలిచిపోయినప్పటికీ, 1950 వరకు భారతీయ యాత్రికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లినట్లు పేర్కొంటారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 1930లో సుమారు 730 మంది భారతీయ యాత్రికులు కైలాసాన్ని సందర్శించారు. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించే వరకు యాత్రికుల సంఖ్య వందల్లోనే ఉండేది. అనంతరం 1951లో యూరోపియన్లకు, 1959లో భారతీయులకు కైలాస మార్గాన్ని మూసివేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

భారత్-చైనా యుద్ధం తర్వాత మరింత కఠిన పరిస్థితులు
1962 భారత్-చైనా యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. దీంతో భారతీయ యాత్రికులకు కైలాస మార్గం మరింత దూరమైంది. విశ్వాసపరంగా ఎంతో పవిత్రమైన ప్రాంతానికి వెళ్లే అవకాశం భౌగోళిక, రాజకీయ పరిణామాల కారణంగా నిలిచిపోయింది. అయితే 1970వ దశకం చివరి నాటికి భారత్-చైనా సంబంధాల్లో క్రమంగా మార్పులు కనిపించడం ప్రారంభమైంది. ఇదే సమయంలో కైలాస మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా తెరపైకి వచ్చాయి.

తెరపైకి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి
ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి పాత్ర ప్రస్తావనకు వస్తుంది. హార్వర్డ్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయనకు చైనీస్ భాషపై కూడా మంచి పట్టు ఉందని చెబుతారు. అప్పటి చైనా నాయకుడు, ఉప ప్రధాని డెంగ్ జియావోపింగ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్వామి పలు సందర్భాల్లో వెల్లడించారు. 1978లో జనతా పార్టీ ఎంపీగా ఉన్న సమయంలో స్వామి బీజింగ్ పర్యటించారు. ఆ సందర్భంగా డెంగ్ జియావోపింగ్‌తో జరిగిన భేటీలో కైలాస మానస సరోవర్ యాత్ర అంశాన్ని ఆయన ప్రస్తావించినట్లు తెలిపారు. స్వామి చెప్పిన వివరాల ప్రకారం, డెంగ్‌కు తొలుత కైలాస పర్వతం గురించి పూర్తి అవగాహన లేకపోయినా, ఈ విషయంపై విచారణ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

1980లో ముందడుగు
1980లో సుబ్రహ్మణ్యస్వామి మరోసారి చైనాను సందర్శించినప్పుడు కైలాస మానస సరోవర్ మార్గం గురించి చర్చ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. రహదారులకు మరమ్మతులు చేయడంతో పాటు అక్కడి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ప్రాంతాన్ని తిరిగి తెరవనున్నట్లు చైనా అధికారులు తనకు తెలిపారని స్వామి వెల్లడించారు. ఆ తర్వాత 1981 ఏప్రిల్‌లో సుబ్రహ్మణ్యస్వామి మరోసారి డెంగ్ జియావోపింగ్‌ను కలిశారు. ఈసారి కైలాస మానస సరోవర్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం వచ్చినట్లు ఆయన తెలిపారు.

1981లో కైలాస యాత్రకు మళ్లీ అవకాశం
1981 జూలైలో సుబ్రహ్మణ్యస్వామి నేతృత్వంలో సుమారు 60 మంది యాత్రికుల బృందం అల్మోరా, లిపులేఖ్ మార్గం మీదుగా కైలాస మానస సరోవర్‌కు బయలుదేరింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతీయులకు ఈ పవిత్ర ప్రాంతానికి వెళ్లే అవకాశం లభించడం అప్పట్లో కీలక పరిణామంగా నిలిచింది. ఈ యాత్రలో తానే తొలి యాత్రికుడినని చైనా ప్రభుత్వం తనకు చెప్పిందని సుబ్రహ్మణ్యస్వామి ఒక కార్యక్రమంలో వెల్లడించారు.

‘మానస సరోవరం తెరవండి’ అని డెంగ్‌ను కోరా: స్వామి
ఒక ఇంటర్వ్యూలో సుబ్రహ్మణ్యస్వామి తనకు, డెంగ్ జియావోపింగ్‌కు మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. డెంగ్ తనను ఏదైనా కోరుకోవచ్చని చెప్పడంతో, తాను మానస సరోవరాన్ని భారతీయులకు తెరవాలని కోరినట్లు స్వామి తెలిపారు. అనంతరం ఈ మార్గం తిరిగి తెరుచుకుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కైలాసం హిందువులకు పవిత్రమైన ప్రదేశం కావడంతో హిందువులను యాత్రకు అనుమతించనున్నట్లు డెంగ్ తనకు చెప్పారని స్వామి వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని వాణిజ్య పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మాత్రం అనుమతించబోమని డెంగ్ చెప్పినట్లు ఆయన తెలిపారు.

నేటి కైలాస మానస సరోవర్ యాత్ర
ప్రస్తుతం భారత ప్రభుత్వం కైలాస మానస సరోవర్ యాత్రను లిపులేఖ్, నాథూ లా మార్గాల ద్వారా నిర్వహిస్తోంది. హిమాలయాల్లోని కఠినమైన భౌగోళిక పరిస్థితులు, వాతావరణ సవాళ్ల మధ్య ఈ యాత్ర సాగుతుంది. ఇటీవల నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, ప్రకృతి వైపరీత్యాలు కైలాస మానస సరోవర్ యాత్రలోని కష్టాలను మరోసారి గుర్తుచేశాయి. ఈ ఘటనలో పలువురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో కైలాస యాత్రకు సంబంధించిన మార్గాలు, భద్రతా ఏర్పాట్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

మూడు దశాబ్దాల తర్వాత తెరచుకున్న పవిత్ర మార్గం
కైలాస మానస సరోవర్ యాత్ర చరిత్రలో 1981 సంవత్సరం ఒక కీలక మలుపుగా నిలిచింది. చైనా టిబెట్ ఆక్రమణ, భారత్-చైనా యుద్ధం, సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా దశాబ్దాల పాటు నిలిచిపోయిన యాత్రకు తిరిగి అవకాశం లభించింది. ఈ పరిణామంలో సుబ్రహ్మణ్యస్వామి-డెంగ్ జియావోపింగ్ మధ్య జరిగిన చర్చలు కీలకంగా మారాయని స్వామి స్వయంగా చెప్పిన వివరాలు ఈ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచాయి.