చాలా మందికి ఒక్కొక్కసారి ఎమర్జెనీ ప్రయాణాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో రైలు ప్రయాణాలు చేయలేకపోతుంటారు. ఇక రైల్లో తత్కాల్ బుక్ చేసుకున్నా.. ఒక్కొక్కసారి కన్ఫామ్ కాదు. దీంతో నిరాశ చెందుతుంటారు. చాలా మంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. అయితే అలాంటి ఆందోళన అక్కర్లేదు. చార్ట్ ప్రిపేర్ అయ్యాక కూడా ఐఆర్సీటీసీలో మరొక ఆప్షన్ ఉంటుందని చాలా మందికి తెలియదు. ఈ విషయం తెలిస్తే.. టెన్షన్ పోతుంది. అయితే ఆ ఆప్షన్ ఏంటో చదివేయండి.
రైల్లో ప్రయాణించాలనుకునే వారికి తత్కాల్ టికెట్ దొరకడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అయితే తత్కాల్లో టికెట్ లభించలేదని ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న ‘కరెంట్ బుకింగ్’ సదుపాయం ద్వారా రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా ఖాళీగా ఉన్న సీట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లోని ‘Charts Vacant’ ఆప్షన్ ద్వారా ఇంకా బుక్ కాని సీట్లు, కోచ్ల వివరాలను ప్రయాణికులు తెలుసుకోవచ్చు. ఖాళీ సీటు అందుబాటులో ఉంటే దాన్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
రైలు బయలుదేరే ముందు తొలి రిజర్వేషన్ చార్ట్ను అధికారులు సిద్ధం చేస్తారు. సాధారణంగా రైలు బయలుదేరే సమయానికి సుమారు నాలుగు గంటల ముందు మొదటి చార్ట్ తయారవుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని సీట్లు ఖాళీగా మిగిలే అవకాశం ఉంటుంది. అలాంటి సీట్లను కరెంట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులకు కేటాయిస్తారు. చార్ట్ సిద్ధమైన తర్వాత రైలు బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు వరకు ఖాళీ సీట్లను బుక్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. అయితే ఈ సమయం రైలు, మార్గాన్ని బట్టి మారవచ్చు. కరెంట్ బుకింగ్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇవి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కావు. ఖాళీ సీటును బుక్ చేసుకున్న ప్రయాణికుడికి కన్ఫర్మ్డ్ (CNF) టికెట్ జారీ అవుతుంది. ఇందులో వెయిటింగ్ లిస్ట్ లేదా RAC ఉండదు.
ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు
కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్ తీసుకుంటే అదనంగా తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు సాధారణ టికెట్ ధరనే చెల్లించాలి. కొన్ని రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్లపై ఇండియన్ రైల్వేస్ 10 శాతం నుంచి 30 శాతం వరకు రాయితీ కూడా అందించే అవకాశం ఉంది. అయితే ఇందులో ఓ ముఖ్యమైన విషయం ఉంది. కరెంట్ బుకింగ్ ద్వారా తీసుకున్న టికెట్లను రద్దు చేస్తే సాధారణంగా రిఫండ్ లభించదు. అందువల్ల ప్రయాణం ఖరారైన తర్వాత మాత్రమే ఇలాంటి టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది.
ఎలా చెక్ చేయాలి?
ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఖాళీ సీట్లను చెక్ చేసుకోవచ్చు.
ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ను ఓపెన్ చేయాలి.
Train విభాగంలోకి వెళ్లాలి.
Charts Vacant ఆప్షన్ను ఎంచుకోవాలి.
రైలు నంబర్, ప్రయాణ తేదీ వివరాలను నమోదు చేయాలి.
అందుబాటులో ఉన్న కోచ్లు, ఖాళీ సీట్ల వివరాలను పరిశీలించాలి.
అనుకూలమైన సీటు కనిపిస్తే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు.
చివరి నిమిషంలో ప్రయాణికులకు ఉపయోగకరం
చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చిన వారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది ప్రయాణికులు మధ్యలోని స్టేషన్లలో రైలు దిగిపోతే.. ఆ తర్వాతి స్టేషన్ల నుంచి ఆ సీట్లు ఖాళీగా అందుబాటులోకి రావచ్చు. అలాంటి సీట్లను కూడా ఇతర ప్రయాణికులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత ఖాళీ సీట్ల గురించి తెలుసుకోవాలంటే ప్రయాణికులు టికెట్ చెకింగ్ సిబ్బంది (TTE)ని సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు Charts Vacant సదుపాయం ద్వారా ఖాళీ సీట్ల వివరాలను ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు. అందువల్ల తత్కాల్ టికెట్ దొరకని ప్రయాణికులకు రైల్వే స్టేషన్కు వెళ్లకుండానే కన్ఫర్మ్డ్ టికెట్ పొందేందుకు కరెంట్ బుకింగ్ మరో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. అయితే ఇక టెన్షన్ ఎందుకు? ఎమర్జెనీ సమయంలో కూడా సాఫీగా ప్రయాణం చేసేయండి.

