Jaishankar: టీఆర్ఎఫ్‌ను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించడాన్ని స్వాగతించిన భారత్

  • టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా గుర్తించిన అమెరికా
  • అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
Jaishankar

Jaishankar

పహల్గామ్‌లో నేరమేధం సృష్టించిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. అమెరికా తీసుకున్న చర్యను భారతదేశం శుక్రవారం స్వాగతించింది. ఈ ప్రయత్నం భారత్-అమెరికా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌కు బలమైన సంకేతంగా ఉంటుందని అభివర్ణించింది. టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆయన విభాగం చేసిన కృషిని ప్రశంసిస్తూ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Felix Baumgartner: సూపర్‌సోనిక్ స్కైడైవ్‌ మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ కన్నుమూత

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. 26 మందిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. అనంతరం పాకిస్థాన్‌పై భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇక మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతం చేశారు. అంతేకాకుండా పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్.. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడారు. పహల్గామ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. భారతదేశానికి అమెరికా బలమైన మద్దతును ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Yashwant Varma: సుప్రీంకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మ.. దర్యాప్తు కమిటీ రిపోర్ట్‌పై పిటిషన్

ఇక కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం కూడా వాషింగ్టన్‌లో పర్యటించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సమావేశం నిర్వహించింది. దాడికి ప్రతిస్పందనగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ఆయనకు వివరించింది.