భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటైన బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి వియత్నాంతో ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖలో కీలక అధికారి రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు.
సింగపూర్లో జరిగిన ప్రతిష్ఠాత్మక షాంగ్రి-లా డైలాగ్ భద్రతా సదస్సులో మాట్లాడిన ఆయన… వియత్నాంతో బ్రహ్మోస్ ఒప్పందంపై ఇప్పటికే సంతకాలు పూర్తయ్యాయని, అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదని తెలిపారు. ‘‘వియత్నాంతో ఒప్పందం ఇప్పటికే కుదిరింది. బహుశా ఇంకా బహిరంగంగా ప్రకటించకపోయి ఉండవచ్చు. కానీ ఒప్పందం పూర్తయింది” అని రాజేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
ఇటీవలే ప్రధాని మోడీ.. వియత్నాం అధ్యక్షుడు టో లామ్ మధ్య జరిగిన సమావేశంలో ఆర్థిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఇండోనేషియాతో కూడా బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతిపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. దీంతో ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాల్లో బ్రహ్మోస్పై ఆసక్తి మరింత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
బ్రహ్మోస్ ప్రత్యేకతలు ఇవే
బ్రహ్మోస్ క్షిపణి భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన అత్యాధునిక సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO), రష్యాకు చెందిన NPO Mashinostroyeniya కలిసి దీనిని అభివృద్ధి చేశాయి. భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లను కలిపి ‘బ్రహ్మోస్’ అని నామకరణం చేశారు. ఈ క్షిపణి మాక్ 2.8 నుంచి మాక్ 3.0 వేగంతో ప్రయాణిస్తుంది. అంటే శబ్ద వేగం కంటే దాదాపు మూడు రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న చాలా వైమానిక రక్షణ వ్యవస్థలకు దీన్ని అడ్డుకోవడం అత్యంత క్లిష్టం. బ్రహ్మోస్ ప్రారంభ దశలో 290 కిలోమీటర్ల పరిధి కలిగి ఉండగా.. ప్రస్తుతం దీని విస్తరించిన శ్రేణి 450 నుంచి 800 కిలోమీటర్ల వరకు చేరుకుంది. భూమి, సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాకుండా సముద్ర మట్టానికి కేవలం 3 నుంచి 10 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్లకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించగలదు. అవసరమైతే 15 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఎగరగలదు. వియత్నాంతో కుదిరిన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయనుండగా.. భారత్ను ప్రపంచ రక్షణ ఎగుమతుల రంగంలో ప్రధాన శక్తిగా నిలబెట్టే దిశగా మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.
