ఐఏఎస్.. దేశంలోనే అత్యున్నత స్థాయి పదవి. ఎంతో సమర్థులైతేనే తప్ప ఈ ఉద్యోగాన్ని సాధించడం అంత సులభం కాదు. దీంతో ఈ ఉద్యోగానికి సమాజంలో కూడా అంతే గౌరవం ఉంటుంది. ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటిది కొందరు ఐఏఎస్లు గాడి తప్పుతున్నారు. మాదిరిగా ఉండాల్సినోళ్లే దారి తప్పుతున్నారు. ఇందుకు మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఐఏఎస్ అధికారి నిత్య పెళ్లిళ్ల ఘటనే ఉదాహరణ.
మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ తాజాగా రహస్యంగా మరో ఐఏఎస్ అధికారి అంకితా ధాకరేను పెళ్లి చేసుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. స్థానిక, జాతీయ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ వ్యవహారంపై అంకితా ధాకరే తండ్రి రవీంద్ర సింగ్ ధాకరే సంచలన విషయాలు వెల్లడించారు.
ఇరు కుటుంబాల సమ్మతితోనే ఈ పెళ్లి జరిగిందని చెప్పారు. ముందు జరిగిన రెండు వివాహాలకు చట్టబద్ధంగా విడాకులు మంజూరు అయ్యాకే ఈ పెళ్లి జరిగినట్లుగా వివరించాడు. అవీ ప్రసాద్-అంకిత చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని చెప్పారు. ఉజ్జయినిలో పని చేస్తున్నప్పుడు 2022లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలిపారు. అవీ ప్రసాద్ ఏడీఎంగా.. అంకిత జిల్లా పంచాయతీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పని చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిందని వెల్లడించారు.
తమ కుమార్తెనే అవీ ప్రసాద్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందన్నారు. గతంలో ఎన్ని సంబంధాలు తెచ్చినా అంగీకరించలేదని.. అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదని చెప్పిందని వివరించారు. ఆశ్చర్యంగా ప్రసాద్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే చట్టబద్ధంగా విడాకులు వచ్చేంత వరకు ఆగినట్లు తెలిపారు. ఇప్పుడు విడాకులు మంజూరు కావడంతో 2026 ఫిబ్రవరి 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసినట్లుగా చెప్పారు. మాతా కీ చౌకీ, మెహందీ, హల్దీ, వివాహం, రిసెప్షన్, వీడ్కోలు వంటి అన్ని ఆచారాలు ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఆచార సంప్రదాయం ప్రకారం జరిగాయన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో రహస్య వివాహం కాదని తోసిపుచ్చారు. వివాహ కార్డులు కూడా ముద్రించినట్లు తెలిపారు. రెండు కుటుంబాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు కూడా హాజరయ్యారని వివరించారు. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ సమీపంలోని శివపురి-షియోపూర్ హైవేలోని ఒక రిసార్ట్లో వివాహం జరిగిందని పేర్కొన్నారు.
అవీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ ఇదే
అవీ ప్రసాద్.. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్నాడు. 2013లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం నచ్చలేదో ఏమో తెలియదు గానీ మళ్లీ 2014లో UPSC పరీక్షలో 13వ ర్యాంకు సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) లో స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు రిజు బాఫ్నా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమెతో ఉన్న పరిచయంతో అవీ ప్రసాద్ వివాహం చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లి ఎన్నేళ్లు నిలవలేదు. కొన్ని రోజులకే పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
అలా మొదటి వివాహం ముగిసిందో లేదో… ఆంధ్రప్రదేశ్కు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్ను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మధ్యప్రదేశ్ కేడర్లో చేరింది. ప్రస్తుతం రత్లాం కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మళ్లీ ఏమైందో.. తెలియదు గానీ నాలుగేళ్ల పాటు బాగానే ఉన్నారు. ఈమెతో కూడా అవీ ప్రసాద్ విడిపోయాడు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇద్దరు కలెక్టర్లతో పెటాకులైన తర్వాతైన బుద్ధిగా ఉండాల్సిన అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 2017 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి అంకితా ధాకరే మెడలో కూడా మూడు ముళ్లు వేసేశాడు. ప్రస్తుతం అంకితా ధాకరే రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆదర్శంగా ఉండాల్సిన ఐఏఎస్ అధికారి పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. సమాజం ఏమనుకుంటుందోనన్న భయం ఏ మాత్రం లేదు. భారతీయ సాంప్రదాయానికి వ్యతిరేకంగా పెళ్లిళ్లు చేసుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
