Indian Railways: వరుడి రైలు ఆలస్యం..పెళ్లి సమయానికి చేర్చిన రైల్వే.. ఎలా సాధ్యమైందంటే..?

  • వరుడి రైలు ఆలస్యం..
  • సకాలంలో ముంబై నుంచి గౌహతి చేరేందుకు రైల్వే సాయం..
  • వైరల్ అవుతున్న సంఘటన..
Indian Railways

Indian Railways

Indian Railways:  ముంబైకి చెందిన వరుడు, అస్సాం గౌహతిలోని పెళ్లి వేదికకు చేరుకునేందుకు ఇండియన్ రైల్వే చేసిన సాయం ఇప్పుడు వైరల్‌గా మారింది. సకాలానికి అతడు వధువుని చేరుకునేలా రైల్వే సాయం చేసింది.

అసలేం జరిగింది..?

ముంబై నుంచి కలకత్తా ప్రయాణిస్తున్న గీతాంజలి ఎక్స్‌ప్రెస్ హౌరా చేరుకునేందుకు ఆలస్యం కావడంతో పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సరైన సమయానికి వేదిక వద్దకు చేరుకోలేమభని భయపడ్డారు. అయితే, పెళ్లి బృందంలోని ఓ వ్యక్తి రైల్వేస్ ‘ఎక్స్’ హ్యాండిల్‌లో సందేశం పోస్ట్ చేసిన, సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు.

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలకు హౌరా చేరుకోవాల్సి ఉంది. అయితే, రైలు ఆలస్యమైంది. హౌరా నుంచి పెళ్లి బృందం సరైఘాట్ ఎక్స్‌ప్రెస్ ద్వారా గౌహతి వెళ్లాలి. ఈ ట్రైన్ సాయంత్రం 4.05 గంటలకు అస్సాం బయలుదేరాల్సి ఉంది.

Read Also: Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్.. 900 మంది పోలీసులు.. 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ

ఎక్స్‌లో చంద్రశేకర్ డి వాఘ్ పోస్ట్ తర్వాత, హౌరా డివిజనల్ రైల్వే మేనేజర్‌కి అవసరమైన సాయం చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి సందేశం అందినట్లు తూర్పు రైల్వే సీనియర్ అధికారులు చెప్పారు. సరై ఘాట్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరడాన్ని ఆలస్యం చేయడంతో పాటు, గీతాంజలి ఎక్స్‌ప్రెస్ హౌరాకు వేగంగా వెళ్లేలా చూశారు.

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4.08 గంటలకు హౌరాకు చేరుకుంది. అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న అధికారులు, ప్లాట్‌ఫారమ్ పై నుంచి బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలను ఉపయోగించి ప్లాట్‌ఫారమ్ 24 నుంచి సరైఘాట్ ఎక్స్ ప్రెస్ బయలుదేరే ప్లాట్‌ఫారమ్‌కి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలు ఆలస్యంగా సరైఘాట్ ఎక్స్‌ప్రెస్ గౌహతి బయలుదేరింది. దీంతో పెళ్లికొడుకు, అతడి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

‘‘నా కొడుకు ఐఐటీ గౌహతిలో పీహెచ్‌డీ చేశాడు. ఆ సమయంలో ఓ అస్సామీ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అందమైన వధువును మా కుటుంబంలోకి ఆహ్వానించేందుకు ముంబై నుంచి వచ్చాం’’ అని పెళ్లికొడుకు తల్లి మంగళ్ వాఘ్ తెలిపారు. కుటుంబం మొత్తం ఇండియన్ రైల్వేకి థాంక్స్ చెప్పింది. రైల్వే సాయం చేయకుంటే సరైన సమయంలో వేదిక వద్దకు చేరుకోలేకపోయేవాళ్లమని చెప్పారు. ఈ పెళ్లి మరాఠీ, అస్సామీ ఆచారాల్లో నిర్వహించినట్లు చెప్పారు.