దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది హిజాబ్ వివాదం. దీనిపై తీవ్రంగా స్పందించారు క్రీడాకారిణి గుత్తా జ్వాల. బాలికలను స్కూల్ గేట్ల వద్ద అవమానించడం మానేయండి. తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. స్కూల్ వారి సురక్షిత స్వర్గం. నీచ రాజకీయాల నుండి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి.. అంటూ ఆమె ట్వీట్ చేశారు. గుత్తా జ్వాల ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్నాటకలోని ఇటీవల హిజాబ్ వివాదం చోటుచేసుకుంది. అది ఇతర స్కూళ్లు, కాలేజీలకూ వ్యాపిస్తోంది. తాజాగా మాండ్యలోని రోటరీ స్కూలుకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను యాజమాన్యం అనుమతించలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం హిజాబ్ ధరించి వచ్చిన వారికి ప్రవేశం లేదన్నారు. ఈ అంశంపై కొందరు తల్లిదండ్రులకు, టీచర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. హిజాబ్ ధరించి తీరతామన్న వారిని వెనక్కి పంపించేశారు. తొలగించినవారిని స్కూల్లోకి అనుమతించారు.
మరోవైపు ఈ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దీనిపై కర్నాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాడివేడి వాదనలు సాగాయి. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించాలని ఖురాన్లో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. హిజాబ్ను నిషేధిస్తూ చట్టం ఎక్కడుందని త్రిసభ్య ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. డ్రెస్కోడ్ పేరుతో కర్నాటక ప్రభుత్వం హక్కులను హరిస్తోందని వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టులో వాదనలు ఇవాళ కూడా జరగనున్నాయి.
