NTV Telugu Site icon

Champai Soren: కుమారులతో కలిసి ఢిల్లీకి వచ్చిన చంపై సోరెన్! బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం!

Champaisoren

Champaisoren

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ హస్తినకు చేరుకున్నారు. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఢిల్లీకి వచ్చారు. కమలం గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జేఎంఎంలో తనకు ఘోరమైన అవమానం జరిగిందని చంపై సోరెన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెళ్లబుచ్చారు. పార్టీలో జరిగిన అవమానాలను పూసగుచ్చినట్లుగా ఎక్స్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాషాయ పార్టీ వైపు చూస్తు్న్నారని తెలుస్తోంది.

త్వరలోనే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. చంపై సోరెన్‌కు కమలనాథులు గాలం వేసినట్లుగా తెలుస్తోంది. చంపైతో పాటు మరికొంత మంది జేఎంఎం ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చంపై తన ఇద్దరు కొడుకులతో ఢిల్లీకి వచ్చారు. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉన్న తన మనవడు రమ్మంటే వచ్చానంటూ ఆయన చెప్పుకొచ్చారు. చూడాలి.. ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

హేమంత్ సోరెన్.. మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో పార్టీలో సీనియర్ సభ్యుడైన చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం హేమంత్ బెయిల్‌పై బయటకు వచ్చారు. దీంతో చంపై సోరెన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలే చంపై మనసు నొచ్చుకునేలా చేసినట్లు తెలుస్తోంది.