West Bengal repolling: బెంగాల్‌లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..

  • ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్
  • మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్
  • మే 24న ఎన్నికల ఫలితాలు
Falta Repolling

Falta Repolling

West Bengal repolling: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న 24 పరగణాల జిల్లాలోని ‘ఫల్తా’ అసెంబ్లీ నియోజకవర్గానికి నేడు (గురువారం) భారీ భద్రత నడుమ రీ-పోలింగ్ జరుగుతోంది. మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పోలింగ్ స్టార్ట్ కావడానికి కేవలం రెండు రోజుల ముందే ఇక్కడ ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి కంచుకోటగా భావించే ఈ స్థానంలో.. ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ మంగళవారం ఆకస్మికంగా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఈ ఆకస్మిక మలుపుతో ఫల్తా నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మే 24న ఈ స్థానానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించనున్నారు.

కట్టుదిట్టమైన భద్రత
వాస్తవానికి ఈ స్థానానికి ఏప్రిల్ 29నే పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నికను రద్దు చేసి, నేడు పూర్తిస్థాయి పునః పోలింగ్‌కు ఆదేశించింది. ఉదయం రీ-పోలింగ్ ప్రారంభానికి ముందు నిబంధనల ప్రకారం బూత్‌లలో మాక్ పోలింగ్ నిర్వహించారు. గతంలో జరిగిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎన్నికల సంఘం అన్ని బూత్‌ల వద్ద మునుపటి కంటే రెట్టింపు స్థాయిలో కేంద్ర బలగాలతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

అభిషేక్ బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ..
ఫల్తా అసెంబ్లీ స్థానం టీఎంసీ అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్‌కు ఈ ప్రాంతంలో బలమైన పట్టు ఉంది. అంతేకాకుండా ఆయనను అభిషేక్ బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా భావిస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జహంగీర్ ఖాన్ పోషించిన కీలక పాత్ర వల్లే అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి 7,10,930 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారని చెబుతున్నారు. అలాంటి కంచుకోట లాంటి స్థానంలో, పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు ఆయన పోటీ నుంచి టీఎంసీకి, ముఖ్యంగా అభిషేక్ బెనర్జీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ విజయం ఖాయమేనా?
టీఎంసీ రేసు నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి దేబాంగ్షు పాండా, కాంగ్రెస్‌కు అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా మధ్యే పోరు ఉందని తెలుస్తోంది. వీరితో పాటు సీపీఐ(ఎం) అభ్యర్థి శంభునాథ్ కుర్మి, స్వతంత్ర అభ్యర్థులు దీప్ హతి, చంద్రకాంత్ రాయ్ కూడా బరిలో ఉన్నారు. అయితే బలమైన ప్రత్యర్థి అయిన టీఎంసీ అభ్యర్థి తప్పుకోవడంతో ఇక్కడ బీజేపీ విజయం దాదాపు ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ స్థానంలో దేబాంగ్షు పాండా గెలిస్తే.. బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ మొత్తం సీట్ల సంఖ్య 208 మార్కుకు చేరుకుంటుంది. దీంతో ఈ రీ-పోలింగ్ ఫలితంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.