Site icon NTV Telugu

Aam Admi Party: ఆప్ గుర్తింపును రద్దు చేయాలి.. ఈసీకి మాజీ బ్యూరోక్రాట్ల లేఖ

Aam Admi Party

Aam Admi Party

Aam Admi Party: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తింపును ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ రిటైర్డ్ బ్యూరోక్రాట్ల బృందం గురువారం భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. గుజరాత్‌లో తన పార్టీ కోసం పనిచేసేలా ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపించడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు.ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్, కేటాయింపు) ఆర్డర్‌లోని సెక్షన్ 1ఏను ఆప్ ఉల్లంఘించిందని రిటైర్డ్ బ్యూరోక్రాట్ల బృందం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిందని కర్ణాటక మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.మదన్ గోపాల్ తెలిపారు.

“ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌.. పోలీస్‌ సిబ్బంది, హోం గార్డులు, అంగన్‌వాడీ వర్కర్స్‌, ప్రజారవాణ వ్యవస్థలోని డ్రైవర్లను, ఆఖరికి పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్లను కూడా వచ్చే ఎన్నికల్లో ఆప్‌ కోసం పని చేయాలని పిలుపు ఇచ్చారు. కానీ, ఇలా ప్రజా సేవకులను.. ఒక పార్టీ, అదీ అధికారంలో ఉన్న పార్టీ తమ ఎన్నికల స్వార్థం కోసం వాడుకోవడం సరైంది కాదు. ఇది ప్రజా ప్రతినిధుల చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించేలా ఉంది. అంతేకాదు.. 1968 ఎన్నికల సింబల్స్‌ ఆర్డర్‌లోని 16ఏ ఉల్లంఘిస్తుంది.” కాబట్టి, లేఖను పరిగణనలోకి తీసుకుని ఆప్‌ గుర్తింపు రద్దు చేయాలని లేఖలో బ్యూరోక్రట్లు కోరారు.

Nitish Kumar: నితీష్‌ కుమార్ సంచలన ప్రకటన.. బీజేపీయేతర కూటమి గెలిస్తే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా!

“ఎన్నికల ముందు ప్రచారం చేయడం అతని హక్కు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ల డ్రైవర్లు, కండక్టర్లు, పోలీసు సిబ్బంది ఫలానా పార్టీ కోసం పనిచేయాలని ఆయన చేసిన విజ్ఞప్తి చాలా తప్పు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేయకూడదు. మాకు ప్రవర్తనా నియమావళి ఉంది. మా విధేయత భారత రాజ్యాంగానికి ఉంది. ఈ ప్రాధాన్యత ప్రజాస్వామ్య ప్రక్రియలకు మంచిది కాదు” అని మాజీ బ్యూరోక్రాట్ ఎం.మదన్ గోపాల్ అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మంచిది కాదని గోపాల్ అన్నారు.

సెప్టెంబర్ 3న గుజరాత్‌లో విలేకరుల సమావేశంలో ఆప్ కన్వీనర్ ప్రభుత్వ ఉద్యోగులను పార్టీ కోసం పని చేసేందుకు ప్రేరేపించారని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ 56 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు గురువారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై మాజీ ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఇతర సర్వీసుల అధికారులు సంతకాలు చేశారు.

Exit mobile version