DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?

Dkshivakumar

Dkshivakumar

DK Shivakumar: గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చాలా వేగంగా చోటుచేసుకుంటూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సీఎం సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించేందుకు డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈరోజు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలవనుంది. డీకే ప్రమాణస్వీకారం జూన్ 3న జరగనుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

దైవభక్తి కలిగిన డీకే శివకుమార్.. ఏ చిన్న పని చేసినా పక్కా ముహూర్తం చూసుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన వ్యక్తిగత జ్యోతిష్యుడు బేలూర్ ద్వారకానాథ్‌ను ప్రమాణస్వీకారం గురించి సంప్రదించినట్లు సమాచారం. ఆయన జూన్ 3వ తేదీ సాయంత్రం సమయాన్ని ‘శుభ ముహూర్తం’గా నిర్ధారించడంతో డీకే శివకుమార్ ఆ తేదీనే లాక్ చేశారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అందుబాటులో ఉండేలా చూసుకోవడం కూడా జూన్ 3ని ఎంచుకోవడానికి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో అత్యంత నిరాడంబరంగా సాగనుందని సమాచారం.

×
×
Ad

ఇద్దరు డిప్యూటీ సీఎంలు
ముఖ్యమంత్రి పీఠం నుంచి సిద్ధరామయ్య దిగిపోవడంతో.. పార్టీలో – రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాల మధ్య సమతుల్యత కాపాడేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం పక్కా స్కెచ్ వేసింది. డీకే శివకుమార్‌తో పాటు ఇద్దరు నేతలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఒకరు దళిత వర్గానికి చెందిన నేత కాగా, మరొకరు మైనారిటీ వర్గానికి చెందిన నేత అని తెలుస్తుంది. అలాగే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య సుదీర్ఘంగా సాగిన అధికార పోరాటానికి ముగింపు పలుకుతూ.. కొత్త ప్రభుత్వంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు ఒక కీలకమైన మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది.

కొత్త క్యాబినెట్ కూర్పుపై రాహుల్ గాంధీ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. పార్టీలోని ఏకైక ఓబీసీ ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యను తప్పించాల్సి రావడంతో.. రాహుల్ గాంధీ తన సామాజిక న్యాయ అజెండా దెబ్బతినకుండా జాగ్రత్తపడుతున్నారని అంటున్నారు. అందుకే కొత్త మంత్రివర్గంలో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారని సమాచారం. దీనితో పాటు 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ ఓటర్లను ఆకర్షించేందుకు, ఈసారి క్యాబినెట్‌లో యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ స్పష్టంగా సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.