Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖకు ప్రత్యేక అధికారాలు

  • ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం
  • ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ప్రత్యేక అధికారాలు
  • ఎన్‌ఎస్‌ఏ కింద అధికారాలు
  • కేంద్రం ఉత్తర్వులు
Delhipolice

Delhipolice

దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం (National Security Act-NSA), 1980 కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌కు నిర్బంధ అధికారాలను వినియోగించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ అధికారాలు 2026 జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు మూడు నెలలపాటు అమల్లో ఉంటాయని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎన్‌ఎస్‌ఏ ప్రకారం ఎవరినైనా అధికారికంగా కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి గరిష్ఠంగా 12 నెలల వరకు నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్‌మంతర్ సహా పలు ప్రాంతాల్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే కేంద్రం ఎన్‌ఎస్‌ఏ అధికారాల పొడిగింపు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ నిర్ణయానికి ప్రస్తుత నిరసనలతో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

ఢిల్లీ పోలీసుల ప్రకారం.. ఎన్‌ఎస్‌ఏ కింద కమిషనర్‌కు ఇచ్చే ఈ అధికారాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సాధారణంగా పొడిగిస్తుంటారు. ప్రస్తుత ఉత్తర్వులు కూడా జూలై 7, 2026న జారీ అయ్యాయని, అవి జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. విద్యార్థుల నిరసనలు ప్రారంభమయ్యే ముందే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని, ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఇది కేవలం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు.

మళ్లీ ఉద్రిక్తం

ఇదిలా ఉండగా బుధవారం రాత్రి ఢిల్లీలోని జంతర్‌మంతర్, సంసద్ మార్గ్ ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ది పార్క్ హోటల్ సమీపంలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొందరు నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పాటు కానాట్ ప్లేస్ వరకు పోలీసులను వెంబడించినట్లు అధికారులు తెలిపారు. ఘటనల నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

సీజేపీ ఉద్యమం ఎలా ప్రారంభమైంది?

ప్రస్తుతం జరుగుతున్న ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకత్వం వహిస్తోంది. బోస్టన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అభిజీత్ దిప్కే ఈ పార్టీని స్థాపించారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్య తర్వాత సోషల్ మీడియాలో వ్యంగ్య ప్రచారంగా ప్రారంభమైన ఈ ఉద్యమం.. తర్వాత ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా యువజన ఉద్యమంగా మారింది. జూన్ 20 నుంచి జంతర్‌మంతర్‌లో సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ కూడా ఈ ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించి నిరసనల్లో పాల్గొంటున్నారు.