CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..

Cjp Protest

Cjp Protest

CJP Protest: ఢిల్లీ జంతర్ మంతర్‌లో కొనసాగుతున్న CJP నిరసన ఇప్పుడు పూర్తిగా బాహ్య అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. విద్యార్థుల మాటున కొందరు అసాంఘిక వ్యక్తులు గుంపులోకి చొరబడి, యూనిఫామ్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడులు చేస్తున్నారని తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకు కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదని, విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో పోలీసులు అత్యంత సంయమనంతో వ్యవహరిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పరిస్థితిని నియంత్రిస్తున్నట్లు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం జంతర్ మంతర్‌లో ప్రశాంత వాతావరణం కనిపించినా సాయంత్రానికి భారీగా జనసమూహం చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఆందోళనకారులు రహదారులపైకి వచ్చి రాళ్ల దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బుధవారం జరిగిన రాళ్ల దాడిలో ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు ఆఫ్ పోలీస్ (ACPలు), నలుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మొదటి ఘటనలో ఏసీపీ జై ప్రకాశ్ నుదుటికి గాయమైనట్లు వెల్లడించారు.

మరోవైపు CJP మాత్రం జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని ఆరోపించింది. ప్రభుత్వం మరోసారి పోలీసులతో కఠిన చర్యలకు సిద్ధమవుతోందా అని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రశ్నించారు. నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని పోలీసు, పారామిలిటరీ బలగాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో జంతర్ మంతర్ పరిణామాలు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారాయి.