CJP: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తోంది. నీట్ పేపర్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల వంటి ప్రతిపక్షాలు కూడా ఆయన దిగిపోవాల్సిందే అని అల్టిమేటం విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే, విద్యార్థుల భవిష్యత్తు కోసం సీజేపీ కానీ ఇతర ఏ పార్టీ అయిన కానీ నిరసన తెలపడం మంచి విషయమే. అయితే, ఈ నిరసన ఎటు వైపు వెళ్తుందో చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. చివరకు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఈ హింసాకాండపై మాట్లాడుతూ.. మా ఉద్యమంలోకి కొన్ని హింసాత్మక శక్తులు చేయారని చెప్పడం చూస్తే, పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నీట్ నుంచి పక్కదారి:
నీట్ పేపర్ లీక్ సీజేపీ నిరసనలకు ప్రధాన కారణంగా ఉంది. కానీ ఈ ఉద్యమం పక్కదారి పడుతున్నట్లు కనిపిస్తోంది. జంతర్ మంతర్ వద్ద వేదికపైకి వచ్చే ప్రముఖులు కానీ, సీజేపీ మద్దతుదారులు కానీ తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు సమస్య పేపర్ లీక్ అయితే ఇందులో హిందూ ధర్మం, రామ మందిరంపై అవాకులు చెవాకులు పేలాల్సిన అవసరం లేదు. కునాల్ కమ్రా వంటి కొన్ని వివాదస్పద వ్యక్తులు సీతా, రాముడి పేర్లను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం ఉద్యమాన్ని దెబ్బతీస్తుంది.
దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు..?
శాంతియుతంగా నిరసన తెలిపుతామని సీజేపీ చెబుతుంది. కానీ పరిస్థితి హింసాత్మకంగా మారింది. పోలీసులు, జర్నలిస్టుపై కూడా దాడులు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెబుతూ హింసకు పాల్పడుతున్నారు. సోమవారం పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ప్రైవేట్ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు.
ఇదే కాకుండా ‘జిహాద్’కు పాల్పడుతామని నినాదాలు చేయడం, పార్లమెంట్ను పడగొడతామని బెదిరించడం, మోడీని చంపేస్తామంటూ మాట్లాడటం చూస్తే వీరి ఎజెండా పేపర్ లీక్ నుంచి పక్కదారి పడుతున్నట్లు కనిపిస్తోంది. కొందరు నిరసనకారులు రామమందిరాన్ని నిందించడం, హిందూ మతాన్ని, దేవీదేవతల్ని కించపరిచేలా మరికొందరు మాట్లాడటం చూస్తే ఈ ఉద్యమంలో ఎవరి ఎజెండా వారికి ఉందనేది తెలుస్తోంది. చివరకు ప్రధాని తల్లిని కూడా తూలనాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత సైన్యాన్ని తిట్టడం, నేపాల్ తరహా ఉద్యమాన్ని తీసుకొస్తామని బెదిరించడం చూస్తే వీరు నీట్ కన్నా వేరే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం అవుతోంది.
ఇదిలా ఉంటే, షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్లను రిలీజ్ చేయాలని మరికొందరు కోరడం మరో వింత. భారత దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ వీరు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చాలా మందికి తెలుసు. ఈశాన్య రాష్ట్రాలను భారత దేశం నుంచి కట్ చేస్తామని చెప్పిన వీరిపై UAPA కేసులు ఉన్నాయి. అలాంటి వారిని రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ఆర్టికల్ లేకపోవడం వల్ల జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు చక్కబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డిమాండ్లు చేయడం చూస్తే ఉద్యమాన్ని కొన్ని వేరే శక్తులు హైజాక్ చేసినట్లు కనిపిస్తోంది.

