Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

Maggi Noodles Case

Maggi Noodles Case

Maggi Noodles Case: 2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మ్యాగీ నూడుల్స్ వివాదానికి సంబంధించి నమోదైన రెండు క్రిమినల్ కేసులను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులకు సంబంధించిన ట్రయల్ కోర్టు సమన్లు, తదనంతర విచారణలను కూడా రద్దు చేసింది. ప్రాసిక్యూషన్‌కు ఆధారమైన శాస్త్రీయ నివేదికల ప్రామాణికత తదుపరి పరిణామాలతో గణనీయంగా బలహీనపడిన నేపథ్యంలో కేసులను కొనసాగించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ మధు జైన్ ఈ మేరకు ధర్మేంద్ర హన్స్రాజ్ కోటక్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతించారు. 2015 నవంబర్ 6, 2016 జనవరి 11 తేదీల్లో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లతో పాటు, ఆ తర్వాత కొనసాగిన అన్ని చర్యలను రద్దు చేశారు.

2015 మేలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆహార ఉత్పత్తుల తనిఖీల్లో భాగంగా ఢిల్లీ ఫుడ్ సేఫ్టీ విభాగం మ్యాగీ నూడుల్స్ నమూనాలను సేకరించింది. వాటిని పరీక్షించిన ఫుడ్ అనలిస్ట్.. మ్యాగీ మసాలా టేస్ట్‌మేకర్‌లో లీడ్ పరిమాణం నిర్దేశిత 2.5 పీపీఎం పరిమితిని మించిందని నివేదించారు. మరో కేసులో ప్యాకెట్‌పై ‘No Added MSG’ అనే ప్రకటనకు సంబంధించి తప్పుదారి పట్టించే లేబులింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నివేదికల ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారంపై పలు న్యాయస్థానాల్లో జరిగిన పరిణామాలు కేసు ప్రాథమిక ఆధారాలను ప్రభావితం చేశాయని ఢిల్లీ హైకోర్టు గుర్తించింది.

దేశవ్యాప్తంగా మ్యాగీపై విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు రద్దు చేయడం, అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CFTRI), మైసూరులో నమూనాలకు తాజా పరీక్షలు నిర్వహించడం వంటి పరిణామాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తాజా పరీక్షల్లో లీడ్ పరిమాణం అనుమతించదగిన పరిమితుల్లోనే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో, మ్యాగీ వివాదానికి సంబంధించిన వినియోగదారుల కేసుపై నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC)లో కూడా విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన CFTRI పరీక్షల నివేదికలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆ కేసు కూడా ముగిసింది.

ప్రస్తుత క్రిమినల్ కేసులు కూడా 2015లో జరిగిన అదే దేశవ్యాప్త నమూనాల సేకరణ ప్రక్రియకు సంబంధించినవేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ కేసుల ప్రాసిక్యూషన్ ప్రధానంగా పాత ఫుడ్ అనలిస్ట్ నివేదికలపైనే ఆధారపడి ఉందని, అనంతరం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన తాజా శాస్త్రీయ పరీక్షలతో ఆ నివేదికల ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోయిందని అభిప్రాయపడింది. తదుపరి న్యాయపరమైన, శాస్త్రీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా కేసులను కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. నిందితులు సుదీర్ఘమైన క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సి రావడం అనవసరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 482 కింద తనకు ఉన్న అధికారాలను వినియోగించి కేసులను కొట్టివేసింది.

ఇదే మ్యాగీ వివాదానికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హైకోర్టులు కూడా గతంలో క్రిమినల్ కేసులను కొట్టివేసిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. CFTRI నివేదికలు, సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న ఆ తీర్పులతో తాను ఏకీభవిస్తున్నట్లు పేర్కొంది. దీంతో 2015లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన మ్యాగీ నూడుల్స్ లీడ్ వివాదానికి సంబంధించిన మరో కీలక క్రిమినల్ కేసుల అధ్యాయం ముగిసినట్లైంది.