IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!

  • మే 23 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • రానున్న 5 రోజులు అత్యంత కీలకం
  • ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి..
Modi

Modi

IMD Yellow Alert: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మే నెల మధ్యలోనే ఎండలు ముదిరిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ముంబై (మహారాష్ట్ర) సహా పలు రాష్ట్రాల్లో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది.

ఢిల్లీలో 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..
రాజధాని నగరంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. వేడి గాలులు, ఉక్కపోతతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. రానున్న మే 23వ తేదీ వరకు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ..
తీవ్ర వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎండి ఇప్పటికే ఢిల్లీకి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశ వ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, ప్రజలందరూ ఎండ నుంచి రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ ఐదు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.